కోచింగ్ సంస్థల నియంత్రణకు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ
1 min read
50 మందికి పైగా విద్యార్థులు ఉన్న అన్ని కోచింగ్ సంస్థలకు CIRMS నమోదు తప్పనిసరి : జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో కోచింగ్ సంస్థల కార్యకలాపాలను నియంత్రిస్తూ, విద్యార్థుల సంక్షేమం మరియు భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆంధ్రప్రదేశ్ కోచింగ్ సంస్థల (నియంత్రణ మరియు క్రమబద్ధీకరణ) నిబంధనలు–2026ను జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజ కుమారి గణియా సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని కలెక్టర్ ఛాంబర్ నందు జిల్లా స్థాయి పర్యవేక్షణ కమిటీ తొలి సమావేశంను కమిటీ మెంబర్–కన్వీనర్, పి.ఎస్.సి. & కె.వి.ఎస్.సి. ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ శశికళ సంబంధిత శాఖల అధికారులతో నిర్వహించారు. కోచింగ్ సంస్థల నియంత్రణలో విద్య, వైద్య ఆరోగ్యం, పోలీస్, మహిళా శిశు సంక్షేమం తదితర శాఖల మధ్య సమన్వయంతో భాగస్వామ్యం ఉండాలన్నారు. విద్యార్థులకు ఒత్తిడిలేని, సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన విద్యా వాతావరణం కల్పించడమే కోచింగ్ సంస్థల నియంత్రణ నిబంధనల ప్రధాన ఉద్దేశ్యమని అన్నారు. కోచింగ్ సంస్థలు నిర్దేశించిన నిబంధనలను తప్పనిసరిగా పాటించి విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.


