నంద్యాల’ను కరువు జిల్లాగా ప్రకటించాలి
1 min read
సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్..
మిడుతూరు న్యూస్ నేడు: నంద్యాల జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి రంగనాయుడు డిమాండ్ చేశారు.నంద్యాల జిల్లా మిడుతూరు మండల పరిధిలోని తలముడిపి గ్రామంలో శనివారం సీపీఐ జిల్లా కరువు బృందం ఎండిపోయిన మొక్కజొన్న,పత్తి, ఎండిపోయిన వరి,మిరప, సోయాబీన్ పంటలను పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్ నినో ప్రభావం వల్ల వర్షపాతం లేనందున పంటలు ఎండిపోయాయని వెంటనే ప్రభుత్వం కరువు జిల్లాగా ప్రకటించి రైతాంగాన్ని ఆదుకోవాలన్నారు.మండలంలో సాధారణ వర్షపాతం కన్నా తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ లో సాగు చేయాల్సిన విస్తీర్ణం కంటే తక్కువగా పంటల సాగు చేపట్టారన్నారు.కౌలు రైతులు పెట్టుబడితో పాటు ముందస్తు కొనుగోలు చెల్లించి తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.తీవ్ర వర్షాభావ పరిస్థితులను జాతీయ విపత్తుగా పరిగణించి నంద్యాల జిల్లాకు ప్రత్యేక కరువు సహాయ ప్యాకేజీని ప్రకటించాలని డిమాండ్ చేశారు.కరువును ఎదుర్కోవడంలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.ఇప్పటికైనా ఎమ్మెల్యేలు,ప్రజా ప్రతినిధులు పంటలను పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని లేనిపక్షంలో సిపిఐ,రైతు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఎమ్మెల్యేల ఇళ్లను ముట్టడి చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్య.కా.సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి సోమన్న,జిల్లా కార్యదర్శి రజిత,ఏఐటి యుసి రాష్ట్ర కార్యదర్శి రమేష్ బాబు,సిపిఐ మద్దిలేటి,రామకృష్ణ మరియు రైతులు పాల్గొన్నారు.


