అక్టోబర్ 9 నాటికి సర్ తుది ఓటర్ల జాబితా ప్రచురణకు పకడ్బందీ చర్యలు
1 min read
పెండింగ్లో ఉన్న క్లెయిమ్లు, ఫామ్లను వేగంగా పరిష్కరిస్తున్నాం
80,283 నోటీసులపై విచారణ ప్రక్రియ పూర్తి
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)లో విచారణలు, ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేసి, పెండింగ్ క్లెయిమ్లు, ఫామ్లను వేగంగా పరిష్కరిస్తూ అక్టోబర్ 9 నాటికి తుది ఓటర్ల జాబితా ప్రచురణకు సిద్ధం చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. శనివారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో SIR ప్రక్రియ పురోగతిపై గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డిఆర్ఓ రాము నాయక్, రాజకీయ పార్టీల తరపున ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి సయ్యద్ రియాజ్ భాష, టిడిపి నుంచి శివరామిరెడ్డి, వైయస్సార్సీపి నుంచి సాయిరాం రెడ్డి, ఆమ్ ఆద్మీ పార్టీ ప్రతినిధి ప్రదీప్, సిపిఐ నుంచి నరసింహులు, బీఎస్పీ పార్టీ ప్రతినిధి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ డ్రాఫ్ట్ పబ్లికేషన్ జూలై 31న నిర్వహించగా, ముందుగా నిర్ణయించిన ఆగస్టు 3వ తేదీకి బదులుగా తుది ప్రచురణ తేదీని భారత ఎన్నికల సంఘం అక్టోబర్ 9వ తేదీ వరకు పొడిగించిందన్నారు. ఈ అదనపు వ్యవధిని సద్వినియోగం చేసుకుని ఓటర్ల వివరాల పరిశీలన, అభ్యంతరాలు, విచారణలు, క్లెయిమ్ల పరిష్కారం తదితర ప్రక్రియలను పూర్తి స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
ఫోటో వెరిఫికేషన్ వేగవంతం చేస్తున్నాం
ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్యూమరేషన్ ఫామ్లలో అప్లోడ్ చేసిన ఓటర్ల ఫోటోలు స్పష్టంగా, సక్రమంగా ఉన్నాయా లేదా అనే అంశంపై పునఃపరిశీలన కొనసాగుతోందని కలెక్టర్ తెలిపారు. సుమారు 12 లక్షల ఫోటోల్లో 10 లక్షల ఫోటోల పరిశీలన పూర్తయిందని, మిగిలిన సుమారు 12 శాతం ఫోటో వెరిఫికేషన్ను ఈ వారంలోనే పూర్తి చేయాలని EROలు, సంబంధిత అధికారులను ఆదేశించినట్లు కలెక్టర్ తెలిపారు. SIR ప్రక్రియకు సంబంధించి రాజకీయ పార్టీల ప్రతినిధులు, ప్రజలకు ఏవైనా సందేహాలు, అభ్యంతరాలు లేదా ఫిర్యాదులు ఉంటే సంబంధిత ఎన్నికల అధికారులు, సిబ్బంది అందుబాటులో ఉంటారని కలెక్టర్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను నిబంధనల ప్రకారం పరిశీలించి తక్షణ పరిష్కారానికి చర్యలు తీసుకుంటారని కలెక్టర్ వివరించారు.


