ఆర్యవైశ్యులు రాజకీయాల్లో రాణించాలి.. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి
1 min read
అరుణాచలంలో ఆర్యవైశ్య వాసవీ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ నూతన భవనాలు ప్రారంభించిన రాష్ట్ర మంత్రి టి.జి భరత్
ఆర్యవైశ్యులకు ఏ కష్టమొచ్చినా అండగా ఉంటానని హామీ ఇచ్చిన మంత్రి టి.జి భరత్
కర్నూలు, న్యూస్ నేడు: ఆర్యవైశ్యులకు ఏ కష్టమొచ్చినా తాను అండగా ఉంటానని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల క్షేత్రంలో ఆర్యవైశ్య వాసవీ నిత్య అన్నదాన సత్రం ట్రస్ట్ నూతన భవనాల ప్రారంభోత్సవ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి టి.జి భరత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ముందుగా మంత్రి దంపతులు అరుణాచల స్వామి, అపీత కుచాంబ దేవి దర్శనం చేసుకున్నారు. అభిషేకం, కుంకుమార్చన చేశారు. ఆ తర్వాత వాసవీ నిత్య అన్నదాన ట్రస్టు భవనాలను మంత్రి ప్రారంభించారు.అనంతరం ఏర్పాటుచేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ అరుణాచలం లాంటి గొప్ప పుణ్యక్షేత్రంలో వాసవీ అమ్మవారి నిత్య అన్నదాన ట్రస్టు భవనాలను ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు చెప్పారు. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని స్వామి అమ్మవార్లను మనస్పూర్తిగా కోరుకున్నానన్నారు. ప్రజలకు సేవ చేయడంలో ఆర్యవైశ్యులు ఎప్పుడూ ముందువరుసలోనే ఉంటారన్నారు. ఆపద సమయాల్లో ప్రజలకు అండగా ఉండేందుకు ఆర్యవైశ్య సంఘాలన్నీ ముందుకొస్తాయని పేర్కొన్నారు. రాజకీయాల్లో సైతం ఆర్యవైశ్యులు రాణించాల్సిన అవసరం ఉందన్నారు. దీనివల్ల ప్రజలకు మరింత సేవ చేసేందుకు అవకాశం ఉంటుందని మంత్రి టి.జి భరత్ అన్నారు.తెలుగు రాష్ట్రాలతో పాటు ఎక్కడకు వెళ్లినా ఆర్యవైశ్యులంటే దివంగత నాయకులు రోశయ్య తర్వాత తన తండ్రి టి.జి వెంకటేష్ గుర్తొస్తారన్నారు. రోశయ్య సైతం ఆర్యవైశ్యుల ఆస్తులను కాపాడాల్సిన బాధ్యత టి.జి వెంకటేష్పై పెట్టారని ఆయన గుర్తుచేశారు. ఎంతో విలువైన ఆర్యవైశ్యుల భూములు కబ్జాలకు గురవ్వకుండా తన తండ్రి టి.జి వెంకటేష్ కాపాడారని తెలిపారు. ఆర్యవైశ్యులు ఎక్కడున్నా వారికి ఏ కష్టమొచ్చినా తన తండ్రితో పాటు తాను కూడా అండగా ఉంటానని మంత్రి టి.జి భరత్ హామీ ఇచ్చారు. ప్రజలకు సేవ చేయడంలో ఉన్న సంతృప్తి మరెక్కడా దొరకదన్నారు. ప్రజాసేవ చేస్తున్నందుకే ఆ దేవుని ఆశీస్సులు తమపై ఉన్నాయని తాను నమ్ముతున్నట్లు మంత్రి టి.జి భరత్ చెప్పారు. అరుణాచలంలో ఆర్యవైశ్యుల నిత్య అన్నదాన ట్రస్టు భవనాలు ఎంతో బాగున్నాయని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ ఎమ్మెల్యే ధనపాల్ సూర్య నారాయణ గుప్త, మాజీ ఎమ్మెల్సీ పోతుల సునీత, పోతుల సురేష్, వాసవీ సత్ర సమూదాయాల ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, ఏపీ ఆర్యవైశ్య యువజన సంఘాల అధ్యక్షుడు శభరీష్, బిజెపి యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు మిట్ట వంశీ, తదితరులు పాల్గొన్నారు.
