సిఎం విజనరీతోనే సర్వతోముఖాభివృద్ధి సాధ్యం
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్, వాణిజ్య శాఖల మంత్రి టీజీ భరత్
కర్నూలు నియోజకవర్గ దార్శనికత కార్యాచరణ కార్యాలయం ప్రారంభం
కర్నూలు, న్యూస్ నేడు: సోమవారం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీతోనే రాష్ట్రం అన్ని విధాలా ప్రగతి పథంలో పయనిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖల మంత్రి టీజీ భరత్ అన్నారు. సోమవారం నగరపాలక కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ యూనిట్ దార్శనికత కార్యాచరణ కార్యాలయాన్ని మంత్రి, కమిషనర్ యస్.రవీంద్ర బాబుతో కలిసి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. విజన్ అనగానే అందరికీ చంద్రబాబే గుర్తు వస్తారని, చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక ‘విజన్ @2020’ కు శ్రీకారం చుట్టారని, దాని ఫలితంగానే హైదరాబాద్ విశ్వనగరంగా ప్రఖ్యాతి గాంచిందని పేర్కొన్నారు. ముందుచూపుతో పనిచేస్తేనే భావితరాలకు మంచి ఫలితాలు చూస్తారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి విజన్-2047 కార్యక్రమానికి నాంది పలికారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి అభిప్రాయాలను తీసుకొని, వాటికీ విజన్ డాక్యుమెంటరీ రూపొందించి, వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని చెప్పారు. దీంతో స్పష్టమైన దిశానిర్దేశంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేస్తారని, భవిష్యత్తులో వాటి ఫలితాలను చూస్తామన్నారు. ఒకొక్క నియోజకవర్గానికి 5 మంది విద్యావంతులతో సాధికార బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వీరు నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ అమలు కోసం పనిచేస్తారని, ఫలితంగా వీరి పనితీరు నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు.
కమిషనర్ మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని, గతంలో విజయవంతమైన విజన్-2020 తరహా, మళ్ళీ ఇప్పుడు విజన్-2047 కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాంది పలికారని, అప్పటికి దేశానికి స్వాతంత్ర్యం దశాబ్దా కాలం పూర్తి అవుతుందన్నారు. అప్పటికి రాష్ట్రం, ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, సమగ్ర ఆలోచనలతో, దార్శనికతతో స్వర్ణాంధ్ర – 2047 అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా విభజించి, ప్రత్యేక సాధికార బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. సాధికార బృందాలకు ఒక కార్యాలయం ఉండాలనే ఉద్దేశ్యంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని వసతులతో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఇంచార్జ్ ఎస్ఈ శేషసాయి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, కార్పొరేటర్ కురుబ పరమేష్, తదితరులు పాల్గొన్నారు.
