యోగాతో సంపూర్ణ ఆరోగ్యం..
1 min read
మంచి తెలివి తేటల కోసం విద్యార్థుల కచ్చితంగా యోగ సాధన చేయాలి
కర్నూలు జిల్లా ఉల్లిందకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా అంతర్జాతీయ యోగ దినోత్సవం
కర్నూలు, న్యూస్ నేడు: యోగ ద్వారా సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమౌతుందని, విద్యార్థులు మంచి ఆరోగ్యంతో పాటు తెలివి తేటల కోసం నిత్యం యోగ సాధన చేయడం వల్ల చక్కని ప్రయోజనం ఉంటుందని కర్నూలు జిల్లా, కల్లూరు మండలం విద్యాధికారి శ్రీమతి వనీజ పేర్కొన్నారు. అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుని మండలంలోని ఉల్లిందకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి యం. లీలావతి ఆధ్వర్యంలో జరిగిన యోగ దినోత్సవ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. యోగాంధ్ర ద్వారా యోగ దశాబ్ది వేడుకలకు ఆంధ్రప్రదేశ్ ప్రపంచ కేంద్రం కావడం ఆనందదాయకమన్న ఆమె, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి స్ఫూర్తితో యోగ వేడుకల్ని మండలమంతా ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఉల్లిందకొండ పాఠశాలలో చొరవ తీసుకుని చక్కని కార్యక్రమాన్ని ఘనంగా ఏర్పాటు చేసిన పాఠశాల సిబ్బందిని అభినందించారు.కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల యోగ ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. ప్రభుత్వం సూచించిన ప్రాథమిక యోగ విధానాన్ని నిర్వహించారు. ఈకార్యక్రమంలో గ్రామ సర్పంచి శ్రీమతి సుంకులమ్మ, గ్రామ సచివాలయ కార్యదర్శి శ్రీ చెన్నయ్య, గ్రామపెద్దలు శ్రీమతి సత్తెనమ్మ సహా గ్రామ వైద్యసిబ్బంది, పాఠశాల ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
