భారత ప్రధాని పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా ఎస్పీ
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: అక్టోబర్ 16న భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్రమోది శ్రీశైలం, కర్నూలుకు రానున్న నేపథ్యంలో జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు.ఈ సంధర్బంగా మంగళవారం ఓర్వకల్లు మండలం, నన్నూరు రాగమయూరి లో బహిరంగ సభ, పార్కింగ్ ప్రదేశాలు, రూట్ డైవర్షన్స్, హెలిప్యాడ్ ఏర్పాట్ల ను పరిశీలించారు. బహిరంగసభకు కర్నూలు, నంద్యాల జిల్లాలోని నలుమూలల నుండి వచ్చే రూట్లను స్వయంగా పరిశీలించారు. జిల్లా పోలీసు అధికారులకు జిల్లా ఎస్పీ పలు సూచనలు , సలహాలు చేశారు. ప్రధాని పర్యటనకు సంబంధించి భద్రతాపరమైన అంశాలను, ఇతర ఏర్పాట్ల పై జిల్లా ఎస్పీ కూలంకషంగా ఇతర అధికారులతో చర్చించారు. ప్రజలు, ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరయ్యే అవకాశం ఉన్నందున, తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, చేయాల్సిన ఏర్పాట్లపై అధికారులకు పలు కీలక సూచనలు చేశారు.ప్రధానమంత్రి పర్యటన అత్యంత ప్రతిష్టాత్మకమైనదని, ఎలాంటి లోటుపాట్లకు తావులేకుండా అధికారులు పూర్తి సమన్వయంతో, సమర్థవంతంగా తమ విధులు నిర్వర్తించాలని స్పష్టం చేశారు. భద్రతా ఏర్పాట్లలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని జిల్లా ఎస్పీ కోరారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ వెంట ఆదోని సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, అడిషనల్ ఎస్పీ హుస్సేన్ పీరా , కర్నూలు ఆర్ డిఓ సందీప్ కుమార్ , డిఎస్పీలు , సిఐలు , ఎస్సైలు, ఇంటెలిజెన్స్, రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు.

