ఐక్యరాజ్యసమితి నిబంధనలకు విరుద్ధంగా దాడులకు తెగబడుతున్న అమెరికా
1 min read

అధికార పార్టీకి కొమ్ముకాస్తున్న పోలీసులు
ప్రజల ఆరోగ్యంతో ఆటలాడుతున్న డ్రగ్ కంట్రోల్ అధికారులు
పోలవరం ప్రాజెక్టుకు ప్రత్యేక నిధులు కేటాయించాలి
24వ తేదీ నుండి ప్రజా వ్యతిరేక విధానాలపై ఆందోళన కార్యక్రమాలు
సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య డిమాండ్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రపంచ వ్యాప్తంగా ప్రజలందరూ శాంతి విరబూసి ప్రజాహితం కోరుతుంటే అగ్రరాజమైన అమెరికా మాత్రం అంతర్జాతీయ నిబంధనలు, ఐక్యరాజ్యసమితి ఆంక్షలకు వ్యతిరేకంగా ఇతర దేశాలపై దాడులకు తెగబడటం అత్యంత హేయమైన చర్య అని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య విమర్శించారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ విధించిన ఆంక్షలకు ఎదురు చెబితే ఆయా దేశాలను కబలిస్తామని స్పష్టమైన హెచ్చరికలు జారీ చేయడం ట్రంప్ ఏకపక్ష నిర్ణయాలకు అద్దం పడుతుందన్నారు. ఇరాన్ లో 175 మంది చిన్న పిల్లలను కనికరం లేకుండా బాంబులతో అంతమొందించడం చాలా దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా మార్చి 24వ తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఇల్లు, ఇళ్ల స్థలం, పింఛన్, రేషన్ కార్డ్, ఇతర ప్రజా ప్రయోజనాలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. మంగళవారం సాయంత్రం ఏలూరులోని సిపిఐ జిల్లా కార్యాలయమైన స్ఫూర్తి భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడారు. అగ్రరాజమైన అమెరికా ఇతర దేశాలను తన గుప్పెట్లోకి తీసుకోవాలనే అత్యుత్సాహంతో ఇరాన్, వెనిజులా సహా పలు దేశాలపై దాడులకు పాల్పడుతుందని వివరించారు. అందువల్ల ప్రధానమంత్రి మోడీ భారతదేశ తరుపున దౌత్యం వ్యవహరించి యుద్ధం నిలుపుదల చేసి సామాన్య పరిస్థితులు నెలకొల్పే విధంగా కృషి చేయాలని ఈశ్వరయ్య సూచించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం 22 నెలలు గడిచినప్పటికీ ప్రజలకు ప్రయోజనం శూన్యమన్నారు. పోలీస్ శాఖ అధికార పార్టీకి కొమ్ము కాస్తూ అత్యుత్సాహం ప్రదర్శించడం సరికాదన్నారు. రాష్ట్రంలో మెడికల్ మాఫియాని నియంత్రించడంలో చంద్రబాబు ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందిందన్నారు. పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహార శైలి సరైంది కాదన్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న జీవనాడిగా పిలుస్తున్న పోలవరం ప్రాజెక్టును నిర్నిత సమయంలో పూర్తిచేసే విధంగా ప్రత్యేక నిధులు కేటాయించాలని ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పి.హరినాద్ రెడ్డి, డేగ ప్రభాకర్, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

