ఏలూరులో లాంఛనంగా ప్రారంభమైన “దివ్యాంగ శక్తి” పథకం
1 min read

దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే బడేటి చంటి,ఆర్టీసీ జోన్-2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రజా శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో సుస్థిర పాలనకు శ్రీకారం చుట్టడంతో పాటు అన్ని వర్గాల వారికి ప్రయోజనాలు కలిగించే ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ప్రజా ప్రభుత్వమని ప్రజల మన్ననలు పొందుతోందని ఏలూరు ఎమ్మెల్యే, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు బడేటి చంటి పేర్కొన్నారు. దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. ఏలూరు పాత బస్టాండ్ లో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, ఆర్టీసీ విజయవాడ జోన్ 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు దివ్యాంగ ప్రయాణికులకు తొలి ఉచిత బస్ టికెట్లు అందజేసి వారితో కలిసి బస్సులో కొంత దూరం ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దివ్యాంగులకు అందుతున్న సంక్షేమ పథకాలు, వారి బాగోగులు గురించి అడిగి తెలుసుకున్నారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఐదేళ్ల వైసిపి విధ్వంస పాలన నుంచి కూటమి ప్రభుత్వ ఆధ్వర్యంలో వికాసం వైపు ఆంధ్రప్రదేశ్ అడుగులు వేస్తోందని చెప్పారు. ఇచ్చిన హామీ మేరకు ఒక్కొక్క దాన్ని అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి బహుళ ప్రయోజనాలు చేకూరేలా ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ మంత్రి నారా లోకేష్ అహర్నిశలు కృషి చేస్తున్నారని చెప్పారు. దీనిలో భాగంగానే ఉగాది కానుకగా దివ్యాంగులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కూటమి ప్రభుత్వం కల్పించిందని చెప్పారు. దివ్యాంగుల సంక్షేమానికి 7 సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వటం జరిగిందని, ఇప్పటికే ఆరు సమస్యలను పరిష్కరించి, ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం కల్పించడం ద్వారా మిగిలిన ఆ ఒక్క సమస్యను కూడా పరిష్కరించినట్లు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. గత వైసిపి ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేసిందని, వాటిని గాడిలో పెట్టేందుకు ప్రభుత్వాధినేతలు నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ప్రజలు అన్ని విషయాలను అర్థం చేసుకుని కూటమి ప్రభుత్వానికి మరింత మద్దతు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఎమ్మెల్యే బడేటి చంటి అభిప్రాయపడ్డారు. దీని ద్వారా దివ్యాంగుల సంక్షేమానికి వారిగా ఆత్మస్థైర్యాన్ని మరింత పెంపొందించడానికి కూటమి ప్రభుత్వం ఎంతగానో దోహదపడుతుందన్నారు. 40% అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులు ఏపీఎస్ఆర్టీసీకి చెందిన పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో ఈరోజు నుంచి ఉచితంగా ప్రయాణించవచ్చని అలాగే ఈ పథకం ద్వారా దివ్యాంగులతో పాటు వచ్చే సహాయకులకు టికెట్ ధరలో 50% రాయితీ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇడా చైర్మన్ పెద్దిబోయిన శివప్రసాద్,ఏఎంసీ చైర్మన్ మామిళ్ళపల్లి పార్థసారథి, కార్పొరేషన్ కో ఆప్షన్ సభ్యులు చోడే వెంకటరత్నం, ఎస్ఎంఆర్ పెదబాబు, జనసేన పార్టీ నగర అధ్యక్షులు వీరంకి పండు, నాయకులు రెడ్డి గౌరీ శంకర్, సరిది రాజేష్, బెజవాడ నాగభూషణం కుమార్, బోండా రాము నాయుడు, ఎట్రించి ధర్మేంద్ర మరియు వివిధ హోదాలలో ఉన్న కూటమి పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు , ఏలూరు ఆర్టీసీ డిపో మేనేజర్ వాణి, ఆర్టీసీ ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

