NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

జి జి హెచ్ లో అరుదైన  శస్త్రచికిత్స

1 min read

15 ఏళ్ల బాలుడికి ప్రాణరక్షణ

కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : కడప జిల్లా ఒంటిమెట్ట గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలుడు పెంచలయ్య గత రెండు నెలలుగా నల్లటి మలం (మెలినా), రక్త వాంతులు (హీమాటెమేసిస్) మరియు తీవ్ర బలహీనతతో బాధపడుతున్నాడు. ఈ లక్షణాల కారణంగా అతనిని మొదట కడపలో పరీక్షించగా, డ్యూడెనమ్‌లో రక్తస్రావం కలిగించే పుండ్లు (duodenal ulcer) ఉన్నట్లు గుర్తించారు.జనవరిలో అతనికి ఎండోస్కోపీ ద్వారా ప్యాడ్‌లాక్ క్లిప్ అమర్చినా, రక్తస్రావం పూర్తిగా ఆగలేదు. ఆ సమయంలో అతని హీమోగ్లోబిన్ స్థాయి కేవలం 2.5 గ్రాములు మాత్రమే ఉండటం గమనార్హం.తదుపరి మెరుగైన చికిత్స కోసం 17-02-2026న కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. అక్కడ యూజీఐఈ (UGIE) పరీక్షలో మళ్లీ రక్తస్రావం జరుగుతున్న డ్యూడెనల్ అల్సర్ గుర్తించి, ఆర్గాన్ ప్లాస్మా కోగ్యులేషన్ (APC) ద్వారా చికిత్స చేశారు. అనీమియా తగ్గించేందుకు రక్త మార్పిడి కూడా చేశారు.అయితే రక్తస్రావం కొనసాగుతుండడంతో వైద్యులు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో మొదటిసారిగా లాపరోస్కోపిక్ గైడెడ్ ఎంటెరోస్కోపీ నిర్వహించారు. శస్త్రచికిత్సలో భాగంగా చిన్న ప్రేగులోని (ప్రాక్సిమల్ ఇలియమ్) భాగంలో ఎంటెరోటమీ చేసి ఎండోస్కోపీ నిర్వహించారు. ఇందులో ఆంజియోఎక్టేసియా (రక్తనాళాల అసాధారణ విస్తరణ) గుర్తించి, దానిపై కూడా APC చికిత్స అందించారు.అదే సమయంలో డ్యూడెనల్ అల్సర్ నుండి రక్తస్రావం కొనసాగుతుండడంతో ఎండోస్కోపీ నిర్వహించిన తరువాత, ఎక్స్‌ప్లోరేటరీ లాపరోటమీ చేశారు. గ్యాస్ట్రోడ్యూడెనల్ ఆర్టరీ (GDA)ను లిగేషన్ చేసి రక్తస్రావాన్ని పూర్తిగా నియంత్రించారు. శస్త్రచికిత్స మొత్తం సుమారు 8 గంటలపాటు కొనసాగింది.శస్త్రచికిత్స అనంతరం బాలుడు కోలుకుని, డిశ్చార్జ్ సమయానికి అతని హీమోగ్లోబిన్ స్థాయి 10 గ్రాములకు పెరిగింది. ప్రస్తుతం అతని ఆరోగ్యం స్థిరంగా ఉంది.ఈ క్లిష్టమైన కేసును శస్త్రచికిత్స విభాగం యూనిట్–2 చీఫ్ డా. ఆర్. రామకృష్ణ నాయక్, శస్త్ర గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ డా. సురేష్ ఆధ్వర్యంలో, అసోసియేట్ ప్రొఫెసర్ డా. సబీరా, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. ప్రణీత్ మరియు డా. ప్రశాంతి సమన్వయంతో విజయవంతంగా నిర్వహించారు.గాస్ట్రోఎంటరాలజీ విభాగం ప్రొఫెసర్ డా. మోహన్ రెడ్డి, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. ప్రవీణ్ కుమార్ రెడ్డి, డా. సందీప్ రెడ్డి , డా. అర్షియా, అనస్థీషియా విభాగం హెచ్‌ఓడీ & ప్రొఫెసర్ డా. సుధీర్, ప్రొఫెసర్ డా. రామశివ నాయక్, అసోసియేట్ ప్రొఫెసర్ డా. మురళీ ప్రభాకర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లు డా. సౌజన్య, డా. గీతా శ్రావణి కూడా ఈ చికిత్సలో కీలక పాత్ర పోషించారు.ఈ సందర్భంగా గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కర్నూల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకటేశ్వర్లు , మరియు సర్జరీ విభాగం అధిపతి డాక్టర్ పి. హరిచరణ్  శస్త్రచికిత్స బృందాన్ని అభినందించారు.వైద్యులు మరియు పీజీలు సమిష్టి కృషితో ఈ బాలుడికి ప్రాణరక్షణ సాధ్యమైంది.

About Author