పెట్టుబడులకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్.. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ గుప్తా
1 min read

పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ 4.0 పాలసీ
జర్మనీ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో కీలక చర్చలు జరిపిన మంత్రి
కర్నూలు, న్యూస్ నేడు: భారత్, జర్మన్ పారిశ్రామిక మరియు సాంకేతిక సహకారాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు, ఏఐ మరియు పారిశ్రామిక భాగస్వామ్యాలను ప్రోత్సహించేందుకు జర్మనీ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ గుప్తా పర్యటన విజయవంతంగా కొనసాగుతోంది. హానోవర్ మెస్సేలో ప్రపంచంలోనే అతిపెద్ద పారిశ్రామిక సాంకేతిక వేదికను మంత్రి టీజీ భరత్ సందర్శించారు. ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఈవీ ఎకోసిస్టమ్స్ మరియు ఇండస్ట్రీ 4.0 రంగాలలో అత్యాధునిక ఆవిష్కరణలను పరిశీలించారు. అధునాతన తయారీ రంగం నుండి భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న ఆటోమేషన్ వరకు ప్రపంచ నాయకులతో కీలక చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ఉన్న అవకాశాలను వారికి వివరించినట్లు మంత్రి టీజీ భరత్ గుప్తా తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో తీసుకొచ్చిన ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రీ 4.0 పాలసీ రాష్ట్రంలో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ఎంతో బాగుందని వారితో పంచుకున్నట్లు చెప్పారు. ఏఐ, రోబోటిక్స్, ఆటోమేషన్, ఈవీ ఎకోసిస్టమ్స్ రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు మంచి అవకాశాలున్నాయని తెలిపారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో రాజధాని అమరావతిని నిర్మిస్తున్నామన్నారు. వైజాగ్లో గూగుల్ డేటా సెంటర్ ఏర్పాటుచేస్తున్నట్లు వివరించారు. ఏపీలో ఉన్న వనరులు పెట్టుబడులు పెట్టేందుకు ఎంతో ఉపయోగపడతాయని మంత్రి టీజీ భరత్ గుప్తా పారిశ్రామికవేత్తలతో చెప్పారు.ఈ సమావేశం అనంతరం అధునాతన ప్యాకేజింగ్ మరియు ఆటోమేషన్ పరిష్కారాలపై ప్రపంచ అగ్రగామి సంస్థతో మంత్రి టీజీ భరత్ సమావేశంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్కు – ముఖ్యంగా ఆహార శుద్ధి మరియు ఫార్మా రంగాలలో – అత్యాధునిక తయారీ, ప్యాకేజింగ్ సాంకేతికత మరియు నైపుణ్యాభివృద్ధిని తీసుకురావడానికి గల అవకాశాలపై చర్చించారు. విస్తరణ, ఆవిష్కరణ మరియు ఎగుమతి ఆధారిత వృద్ధి కోసం దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ను ప్రాధాన్య కేంద్రంగా నిలపడంపై దృష్టి సారించినట్లు మంత్రి తెలిపారు.


