పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా అధికారులు పనిచేయాలి..
1 min read
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్
ఏపీఐఐసీ కార్యాలయంలో జెడ్.యం, జీ.యంలతో రివ్యూ మీటింగ్ నిర్వహించిన మంత్రి టి.జి భరత్
మంగళగిరి, న్యూస్ నేడు: రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులు గ్రౌండింగ్ అయ్యేలా క్షేత్ర స్థాయిలో అధికారులు నిత్యం పర్యవేక్షించాలని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి భరత్ అన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ కార్యాలయంలో జెడ్.యంలు, జీ.యంలతో మంత్రి రివ్యూ మీటింగ్ నిర్వహించారు. ఈ సమావేశంలో గత ఎస్.ఐ.పి.బి సమావేశాల్లో ఆమోదించిన పెట్టుబడులకు చెందిన ప్రాజెక్టులపై చర్చించారు. బాపట్ల, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, గుంటూరు, కాకినాడ, క్రిష్ణ, ఎన్టీఆర్, పల్నాడు, నెల్లూరు, డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాల అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో జిల్లాల వారీగా ప్రాజెక్టుల ప్రస్తుత స్థితిపై చర్చించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. పరిశ్రమలు పెట్టేందుకు అనుమతులు ఇచ్చే విషయంలో ఎలాంటి ఆలస్యం ఉండకూడదన్నారు. ప్రతి కంపెనీ ప్రతినిధులతో నిరంతరం మాట్లాడి గ్రౌండ్ అయ్యేవిధంగా పనిచేయాలన్నారు. ఇండస్ట్రియల్ పార్కుల్లో సమస్యలను పరిష్కరించాలన్నారు. ప్రతి జిల్లాలో తప్పనిసరిగా డి.ఐ.పి.సి సమావేశాలు నిర్వహించాలని ఆదేశించారు. క్షేత్ర స్థాయిలో ఇబ్బందులు ఏమైనా ఉంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలన్నారు. ఇప్పటికే ల్యాండ్ కేటాయించి ఇంకా మొదలుపెట్టని ప్రాజెక్టులపై ఒకటికి రెండు సార్లు మాట్లాడాలన్నారు. అప్పటికీ ప్రాజెక్టు విషయంలో కదలిక లేకపోతే ల్యాండ్ క్యాన్సిల్ చేయాలని చెప్పారు. ఏపీఐఐసీ భూములకు సంబంధించి పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశించారు.


