రీ సర్వే ప్రక్రియను పకడ్బందీగా చేపట్టండి
1 min read
రీ సర్వే ప్రక్రియను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా జాయింట్ కలెక్టర్
సర్వే చేసేటప్పుడు రైతులకు ముందస్తు నోటీసులు ఇవ్వాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : రి సర్వే ప్రక్రియ పనులు పకడ్బందీగా చేపట్టాలని జిల్లా జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ పేర్కొన్నారు.బుదవారం దేవనకొండ మండలం పెద్దపల్లి గ్రామంలో 5వ దశలో జరుగుచున్న రీ సర్వే ప్రక్రియ పనులు ఆకస్మికంగా తనిఖీ చేసి పరిశీలించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ… సర్వే ప్రక్రియ పారదర్శకంగా, నిబంధనల ప్రకారం జరుగుతోందో లేదో ప్రత్యక్షంగా రైతులతో మాట్లాడి తెలుసుకున్నారు. సర్వే ప్రారంభానికి ముందు నోటీసులు అందించారా? సర్వే విధానం, వివరాలు మీకు పూర్తిగా తెలియజేశారా? అనే అంశాలపై రైతులను ప్రశ్నించారు. దీనికి స్పందించిన రైతులు సానుకూలంగా స్పందిస్తూ, ముందస్తు సమాచారం అందించడంతో పాటు సర్వే ప్రక్రియ స్పష్టంగా వివరించబడిందని తెలిపారు. అధికారులు ఇదే విధంగా పారదర్శకతను కొనసాగిస్తూ రైతుల విశ్వాసాన్ని పెంపొందించాలన్నారు. ప్రతి భూ యజమానికి సర్వేకు ముందుగా నోటీసులు జారీ చేయడం తప్పనిసరి అని అన్నారు. రైతుల సమక్షంలోనే సర్వే నిర్వహించాలన్నారు. సర్వే సమయంలో భూసరిహద్దులు, రికార్డులు, ఫీల్డ్ మేజర్మెంట్ బుక్స్ (FMB) తదితర వివరాలను సమగ్రంగా పరిశీలించి ఖచ్చితమైన రికార్డులను నమోదు చేయాలని సూచించారు. సర్వే ప్రక్రియలో ఎటువంటి నిర్లక్ష్యం, ఉండకూడదని హెచ్చరించారు. ప్రభుత్వం చేపడుతున్న ఈ రీ సర్వే కార్యక్రమం ద్వారా భూములపై స్పష్టమైన హక్కులు స్థిరపడటంతో పాటు భవిష్యత్తులో భూ వివాదాలు తగ్గుతాయని తెలిపారు. ఆధునిక సాంకేతిక పద్ధతులను ఉపయోగించి ఖచ్చితమైన సర్వే నిర్వహించడం ద్వారా పారదర్శకత పెరుగుతుందని జాయింట్ కలెక్టర్ పేర్కొన్నారు.


