మురికి నీటిలో గణనాథుడి నిమజ్జనమా?.. బుట్టా రేణుక ఆగ్రహం
1 min read
కులమతాలకు అతీతంగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే పండుగ వినాయక చవితి
నిమజ్జనానికి పరిశుభ్రమైన నీటిని ఏర్పాటు చేయాలి
కేసీ కెనాల్లోకి మురుగునీరు చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి
కర్నూలు, న్యూస్ నేడు : వినాయక చవితి కులమతాలకు అతీతంగా ప్రజలంతా కలిసికట్టుగా భక్తిశ్రద్ధలతో నిర్వహించే గొప్ప పండుగ అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ శ్రీమతి బుట్టా రేణుక అన్నారు. ప్రజల సుఖసంతోషాలు, రైతులకు సమృద్ధిగా పంటలు, వ్యాపారాభివృద్ధి, కుటుంబాల్లో అష్టైశ్వర్యాలు కలగాలని గణనాథుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తారని తెలిపారు.అలాంటి గణనాథుడి నిమజ్జనాన్ని కేసీ కెనాల్లో కలుస్తున్న మురుగునీటిలో నిర్వహించేలా ఏర్పాట్లు చేయడం ఎంతవరకు సమంజసమని బుట్టా రేణుక ప్రశ్నించారు. నిమజ్జనానికి పరిశుభ్రమైన నీటిని ఏర్పాటు చేసి భక్తుల మనోభావాలను గౌరవించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.కర్నూలు మున్సిపల్ అధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి పరిశుభ్రమైన నీటిని అందుబాటులోకి తీసుకురావడంతో పాటు కేసీ కెనాల్లోకి మురుగునీరు చేరకుండా శాశ్వత చర్యలు చేపట్టాలని కోరారు. మురుగునీరు కలవడం నిమజ్జనానికే కాకుండా ప్రజారోగ్యానికి కూడా ముప్పుగా మారే అవకాశం ఉన్నందున, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని బుట్టా రేణుక డిమాండ్ చేశారు.


