NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలు

1 min read

జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా

నంద్యాల, న్యూస్​ నేడు : ఈనెల 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకొని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వారం రోజులపాటు మహిళా సాధికారతపై అనేక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఇండోర్ స్టేడియం నుండి మున్సిపల్ కార్యాలయం వరకు నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ ర్యాలీని జిల్లా కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. జాయింట్ కలెక్టర్ సి. విష్ణు చరణ్, అడిషనల్ ఎస్పీ మంద జావలి ఆల్ఫెన్స్, స్త్రీ శిశు సంక్షేమ శాఖ పిడి లీలావతి, జిల్లా ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాలలో భాగంగా మొదటి రోజు ఆడబిడ్డ పుట్టగానే బిడ్డను అభినందిస్తూ బిడ్డ పేరు మీద మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు. అలాగే గతంలో మహిళలు సాధించిన విజయాలను గుర్తుకు తెచ్చుకుంటూ స్మరించుకోవాలన్నారు. సమాజంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మహిళలను గుర్తించి సంబంధిత మహిళలకు చేయూతనందించి స్వశక్తితో ఎదిగేలా చూడాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. స్త్రీ పారిశ్రామికవేత్తగా రాణిస్తే వేలాది మంది మహిళలను భాగస్వామ్యం చేయడమే కాకుండా సంబంధిత మహిళలు ఆర్థికంగా నిలుదొక్కునేటట్లు చేయొచ్చని కలెక్టర్ తెలిపారు. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా పిల్లలను మంచిగా చదివించి ఉన్నత వ్యక్తులుగా తీర్చిదిద్ది సమాజాన్ని ముందుకు నడిపించే స్థాయికి తీసుకురావాలన్న ఆలోచన తల్లిదండ్రుల్లో ఉండాలని కలెక్టర్ ఈ సందర్భంగా అన్నారు. మహిళలు ఆర్థికంగా అభ్యున్నతి సాధించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతోందన్నారు. అంతకుముందు ఇండోర్ స్టేడియంలో మొక్కలు నాటే కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. అడిషనల్ ఎస్పీ మంద జావలి ఆల్ఫెన్స్ మాట్లాడుతూ మహిళలు అన్నిరంగాల్లో పురుషులతో సమానంగా రాణిస్తున్నారని, సమాజంలో తమకంటూ ఓ ప్రత్యేకత, హోదాను, గుర్తింపును తెచ్చుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నిరంజన్ రెడ్డి సిపిఓ వేణుగోపాల్ భూగర్భ జల శాఖ డిడి రఘురాం, ఆర్టీసీ ఆర్ఎం రజియా సుల్తానా, సాంఘిక సంక్షేమ శాఖ డిడి చింతామణి, పశుసంవర్ధక అధికారి గోవింద నాయక్ తదితరులు పాల్గొన్నారు.

About Author