కోగిలతోటలో ఎమ్మార్పీఎస్ “గో టు విలేజ్” కార్యక్రమం విజయవంతం
1 min read
హోళగుందన్యూస్ నేడు: హోళగుంద మండలం కోగిలతోట గ్రామంలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు “గో టు విలేజ్” కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ ప్రజల్లో విద్యా చైతన్యం, సామాజిక అవగాహన మరియు సంఘటిత శక్తిని పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి నాయకులు హాజరై ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు ఎస్. కెంచప్ప, ఎంఎస్పి మండల అధ్యక్షుడు దేవప్ప, ఎంఎస్పి జిల్లా కమిటీ సభ్యుడు పక్కిరప్ప, ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ విద్యే అభివృద్ధికి పునాది అని, ప్రతి కుటుంబం తమ పిల్లల చదువుపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. విద్య ద్వారా మాత్రమే సామాజిక, ఆర్థికంగా ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని తెలిపారు.యువత నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజ అభివృద్ధిలో ముందుండాలని, మహిళలు స్వయం ఉపాధి అవకాశాలు, పొదుపు సంఘాలు మరియు ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక స్వావలంబన సాధించాలని పిలుపునిచ్చారు. మహిళల సాధికారతతో కుటుంబాలతో పాటు సమాజం కూడా అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు.జూలై 7న ప్రతి గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని నాయకులు కోరారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమం 32వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా రిజర్వేషన్ల ఫలాలు ప్రతి అర్హ కుటుంబానికి చేరేలా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని అన్నారు.విద్య, చైతన్యం, సంఘటిత శక్తి, సామాజిక న్యాయం సాధనే లక్ష్యంగా ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో ప్రజలతో మమేకమై పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, కమిటీ సభ్యులు మాలింగ, వీరేష్, చెన్నప్ప, శంకరప్ప, అరకాలప్ప, ఎంపీటీసీ రమేష్, యువకులు, ఎమ్మార్పీఎస్ మరియు ఎంఎస్పి కార్యకర్తలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది.

