జిల్లాలో నీట్ పునః పరీక్షలు ప్రశాంతంగా ముగింపు
1 min read
కట్టుదిట్టమైన భద్రత మధ్య నీట్ రీ-ఎగ్జామినేషన్ నిర్వహణ
1,521 అభ్యర్థులు కేటాయింపు – 1,401 మంది హాజరు
అవాంఛనీయ సంఘటనలు లేకుండా నీట్ పునః పరీక్షల నిర్వహణ
జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్ (యూజీ)-2026 పునః పరీక్షలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా ముగిశాయని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి తెలిపారు. ఈ సందర్భంగా నంద్యాల పట్టణంలోని పరీక్షా కేంద్రాలను జిల్లా కలెక్టర్ స్వయంగా సందర్శించి పరిశీలించారు. పరీక్ష నిర్వహణలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా, విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.నీట్ కోఆర్డినేటర్ టి. వెంకటేశ్వరరావు వివరాల ప్రకారం, జిల్లాలో మొత్తం 1,521 మంది అభ్యర్థులకు పరీక్ష కేటాయించగా, వారిలో 1,401 మంది హాజరయ్యారు. 120 మంది గైర్హాజరయ్యారు.
అభ్యర్థుల వివరాలు ఇలా ఉన్నాయి:
కేటాయించిన పురుష అభ్యర్థులు – 432 మంది, కేటాయించిన మహిళా అభ్యర్థులు – 1,089 మంది, హాజరైన పురుష అభ్యర్థులు – 407 మంది, హాజరైన మహిళా అభ్యర్థులు – 994 మంది, మొత్తం హాజరైన అభ్యర్థులు – 1,401 మంది, గైర్హాజరైన అభ్యర్థులు – 120 మంది, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 5.15 గంటల వరకు పరీక్ష నిర్వహించగా, దివ్యాంగ (పి.డబ్ల్యు.డి.) అభ్యర్థులకు అదనంగా ఒక గంట సమయం కేటాయించి సాయంత్రం 6.15 గంటల వరకు పరీక్ష రాసే అవకాశం కల్పించినట్లు తెలిపారు. మాల్ ప్రాక్టీస్కు ఎలాంటి అవకాశం లేకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. పోలీసు శాఖ, ఇంటెలిజెన్స్ విభాగాల సమన్వయంతో అన్ని పరీక్షా కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పరీక్ష ముగిసిన అనంతరం ఆన్సర్ షీట్లను నిర్దేశిత భద్రతా నిబంధనల ప్రకారం పోస్టల్ వ్యవస్థ ద్వారా సంబంధిత అధికారులకు పంపించే ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు.అలాగే జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు తాగునీరు, బిస్కెట్లు అందుబాటులో ఉంచినట్లు తెలిపారు.

