నగర ప్రగతే మా ధ్యేయం…
1 min read

రూ.4.33 కోట్ల అభివృద్ధి పనులకు మంత్రి టీజీ భరత్ శంకుస్థాపన
దశాబ్దాల సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కారం
నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దేందుకు చర్యలు
కర్నూలు, న్యూస్ నేడు: మంగళవారం కర్నూలు నగర ప్రగతే తమ పథమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. మంగళవారం నగరంలోని వివిధ వార్డుల్లో రూ.4.33 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు మంత్రి, కమిషనర్ పి. విశ్వనాథ్తో కలిసి శంకుస్థాపనలు చేశారు.48వ వార్డు అమీర్ హైదర్ ఖాన్ కాలనీలో సీసీ రోడ్లు, 13వ వార్డులో బసవా సర్కిల్ వద్ద సెంట్రల్ మీడియన్ అభివృద్ధి పనులు, 8వ వార్డులో పెడ్డపదకాన మైదానం వద్ద మహిళల కమ్యూనిటీ టాయిలెట్, మోతియా హైస్కూల్ వెనుకభాగంలో కమ్యూనిటీ హాల్ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. అలాగే 17వ వార్డు జోహరాపురంలో సీసీ రోడ్ల నిర్మాణం, 18వ వార్డులో పబ్లిక్ టాయిలెట్ పునర్నిర్మాణం, 24, 25వ వార్డులకు సంబంధించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య సర్కిల్ పునరుద్ధరణతో పాటు నగరంలోని వివిధ ప్రాంతాలలో డివైడర్లకు పెయింటింగ్ పనులకు శంకుస్థాపనలు చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నగరంలోని ప్రతి వార్డులో అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు చర్యలు వేగవంతం చేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వంలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, దశాబ్దాలుగా ఉన్న ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్ పి. విశ్వనాథ్ నిజాయితీగా, కఠినంగా పనిచేస్తున్నారని, దీన్ని ఓర్వలేక కొందరు పనిగట్టుకుని పత్రికల్లో వార్తలు రాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు పనులు చేస్తే కఠినంగా వ్యవహరిస్తామని, బాగా పనిచేస్తే ప్రోత్సహిస్తామని స్పష్టం చేశారు.నగరాన్ని స్మార్ట్ సిటిగా తీర్చిదిద్దేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎగ్జిబిషన్ గ్రౌండ్ను పిపిపి పద్ధతిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. శివారు ప్రాంతాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేశామని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామన్నారు. పట్టాల పంపిణీలో అనేక నిబంధనలు సడలించి, వేలాది కుటుంబాలకు ప్రయోజనం కలిగించామని, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు కల్పించడమే లక్ష్యమని స్పష్టం చేశారు.కార్యక్రమంలో ఏపి స్టేట్ హజ్ కమిటీ సభ్యులు మన్సూర్ అలీ ఖాన్, టిడిపి నేతలు, బూత్ ఇంచార్జీలు, తదితరులు పాల్గొన్నారు.


