డిజిటల్ అరెస్టు పేరుతో వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
1 min read
సైబర్ నేరగాళ్ళు చేసే మోసాలు వాటిని ఎవరు నమ్మవద్దు…
కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు
ఇటీవల “డిజిటల్ అరెస్ట్” అనే పేరుతో సైబర్ మోసాలు ఎక్కువ అవుతున్నాయి… జాగ్రత్త…
సైబర్ నేరాల్లో సొమ్ము రికవరీకి అవకాశం గంటలోపే… అప్రమత్తతే కీలకం.
తెలియని వ్యక్తులకు బ్యాంకు ఖాతా ల ఒ.టి.పి.లను ఎవ్వరికీ చెప్పవద్దు.
కర్నూలు, న్యూస్ నేడు: డిజిటల్ అరెస్టు పేరుతో సైబర్ నేరగాళ్ళు పోలీసులమని , సీబీఐ అధికారులమని లేదా ఇతర ప్రభుత్వ అధికారులుగా నటిస్తూ వీడియో కాల్స్ చేస్తూ మీ మీద కేసు నమోదైందని, గంజాయి, డ్రగ్స్ కేసుల్లో ఇరుక్కున్నారని, మీరు అక్రమ కార్యకలాపాల్లో పాల్గొన్నారని, మీ పేరు మీద కోరియర్ వచ్చిందని అందులో డ్రగ్స్ ఉన్నాయని లేదా మీ సిమ్/బ్యాంక్ ఖాతా కు వాడబడిందని వచ్చే కాల్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆదివారం కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ గారు విజ్ఞప్తి చేశారు.పోలీసులు ఎప్పుడూ వీడియో, ఆడియో కాల్స్ చేయరన్న విషయం గ్రహించాలన్నారు. ఎవరికీ కూడా వీడియో కాల్ ద్వారా అరెస్టు గురించి సమాచారం చెప్పడం పోలీసుల పని కాదన్నారు. .అసలైన అధికారులు బ్యాంక్ ఖాతా / ఆధార్ / OTP అడగరన్నారు. కేసులో సహాయం చేస్తామని, నమ్మించి, తాము సూచించిన బ్యాంకు ఖాతాకు భారీగా నగదు పంపాలని కోరుతారన్నారు. తమతో మాట్లాడిన వివరాలను ఎవ్వరికీ తెలపకుండా ఉండాలని తమ బ్యాంకు ఖాతాను రిజర్వు బ్యాంకు సహకారంతో పరిశీలించాల్సి ఉందని, వివరాలు సేకరించి, తమ యొక్క బ్యాంకు ఖాతాలలో ఉన్న డబ్బును కాజేస్తారన్నారు. ఎవరైనా తెలియని వ్యక్తులు కాల్ చేసి భయభ్రాంతులకు గురి చేస్తే అటువంటి ఫోన్ నెంబర్లను బ్లాక్ చేసి ఆ సమాచారాన్ని స్థానిక పోలీసు స్టేషన్ లోగాని లేదా సైబర్ ల్యాబ్ పోలీసులకు గాని సమాచారం అందించాలన్నారు. ఈ తరహా నేరాల్లో ఎవరైనా నగదును పోగొట్టు కొన్నట్లయితే ఒక గంటలోపే 1930 కు లేదా నేషనల్ సైబరు క్రైం పోర్టల్లో https://cybercrime.gov.in/ కు రిపోర్టు చేయాలన్నారు. సైబర్ నేరం జరిగిన గంటలోపే ఫిర్యాదు చేస్తే సైబర్ నేరగాళ్లు దోచుకున్న సొమ్మునంతా తిరిగి రికవరీ చేసి ఇప్పించేందుకు పోలీసులకు అవకాశం ఉంటుందని, గంటలోపే అప్రమత్తతే కీలకమని దాన్ని గోల్డెన్ అవర్ అని జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ ఐపియస్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

