పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన-“సేవా సేతు” కార్యక్రమం
1 min read
ఈనెల 17 నుండి అక్టోబర్ 17వ తేదీ వరకు ప్రత్యేక సేవా సేతు శిబిరాలు
‘సేవా సేతు’ కరపత్రాలను ఆవిష్కరించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “పి ఎం సూర్యఘర్ -ముఫ్తి బిజిలి యోజన” పథకంపై ప్రజలకు మరింత అవగాహన కల్పించి, అర్హులైన గృహ వినియోగదారులు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా చర్యలు తీసుకోవాలని ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య (చంటి) చెప్పారు. స్థానిక అమీనాపేటలోని పోలీస్ కల్యాణమండపంలో గురువారం “పి ఎం సూర్యఘర్ -ముఫ్తి బిజిలి యోజన” పథకంపై ముద్రించిన కరపత్రాలను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ “పి ఎం సూర్యఘర్ -ముఫ్తి బిజిలి యోజన” పథకంపై అర్హులైన గృహ వినియోగదారులు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రజలకు అవగాహన కలిగించి ప్రోత్సహించాలన్నారు. ఏపీఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ కె.ఎం. అంబేద్కర్ మాట్లాడుతూ “పి ఎం సూర్యఘర్ -ముఫ్తి బిజిలి యోజన” పథకంలో అర్హులైన గృహ వినియోగదారులు రూఫ్టాప్ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేలా ప్రోత్సహించేందుకు “సేవా సేతు (Seva Setu)” కార్యక్రమాన్ని ఈనెల 17వ తేదీ నుండి అక్టోబర్, 17వ తేదీ వరకు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఏలూరు ఆపరేషన్ సర్కిల్ పరిధిలోని అన్ని సబ్డివిజన్ కార్యాలయాల స్థాయిలో సేవా సేతు శిబిరాలను నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ శిబిరాల ప్రధాన ఉద్దేశ్యం ప్రజలకు పీఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలను వివరించడంతో పాటు, రూఫ్టాప్ సోలార్ ఏర్పాటుకు అవసరమైన రిజిస్ట్రేషన్, ఆన్లైన్ దరఖాస్తు, డాక్యుమెంట్ల సమర్పణ, డిస్కం అనుమతులు, బ్యాంకు రుణాలు, సబ్సిడీ ప్రక్రియ, సోలార్ ప్లాంట్ ఏర్పాటు తదితర అంశాల్లో ప్రత్యక్షంగా సహాయం అందించడం అని చెప్పారు. .“ప్రతి ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ – ప్రతి కుటుంబానికి విద్యుత్ పొదుపు – పర్యావరణ పరిరక్షణ” లక్ష్యంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అంబేద్కర్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏడిఈ రాజ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు.



