స్వచ్ఛతా హిసేవా-2026ను జిల్లాలో విజయవంతంగా నిర్వహించాలి
1 min read
స్వచ్ఛతా హి సేవా-2026 గోడ పత్రికలను ఆవిష్కరించిన ఇంచార్జి జిల్లా కలెక్టరు డా:యం.జె.అభిషేక్ గౌడ
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: జిల్లా కలెక్టరేటు జిల్లా జాయింటు కలెక్టరు ఛాంబర్లో గురువారం స్వచ్ఛతా హి సేవా -2026 గోడ పత్రికలను ఇంచార్జి జిల్లా కలెక్టరు డా:యం.జె. అభిషేక్ గౌడ ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టరు డా:యం.జె. అభిషేక్ గౌడ మాట్లాడుతూ స్వచ్ఛతా హిసేవా ప్రతి ఒక్కరి బాధ్యత అని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడంతో పాటు ప్రజల్లో స్వచ్ఛతపై అవగాహన పెంపొందించాల్సిన అవసరం ఉందన్నారు. సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 17 వరకు నెల రోజుల పాటు నిర్వహించే స్వచ్ఛతా హిసేవా-2026 కార్యక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ శాఖలు,పట్టణ స్థానిక సంస్థలు, మండల స్థాయి అధికారులు, విద్యా సంస్థలు, స్వయం సహాయక సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు,యువత, విద్యార్థులు,సఫాయిమిత్రలు, పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలను భాగస్వాములను చెయ్యాలని సూచించారు.స్వచ్ఛతను కేవలం ఒక కార్యక్రమంగా కాకుండా ప్రజల జీవన విధానంలో భాగంగా మార్చేలా విస్తృత అవగాహన కల్పించాలని తెలిపారు. స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో ప్రజలు, ప్రజాప్రతినిధులు, అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు విస్తృతంగా భాగస్వాములు కావాలని సూచించారు. గ్రామాలు, పట్టణాల్లో పారిశుద్ధ్య నిర్వహణ, పరిశుభ్రమైన పరిసరాల పరిరక్షణ, ప్రజల్లో వ్యక్తిగత పరిశుభ్రతపై అవగాహన కల్పించేలా కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. స్వచ్ఛమైన, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా స్వచ్ఛత కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీశాఖ అధికారి జి.వి.కె.మల్లిఖార్జునరావు, జిల్లా విద్యాశాఖ అధికారి యం.వెంకట లక్ష్మమ్మ, డిఆర్డిఏ పిడి టి.వి. విజయలక్ష్మి, ఐసిడిఎస్ పిడి. పి.శారద, జిల్లా స్పోర్ట్స్ అభివృద్ధి అధికారి సయ్యద్ అబ్దుల్ అజీజ్, తదితర అధికారులు పాల్గొన్నారు.


