కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో సీడ్ పెలెటైజేషన్ కార్యక్రమం
1 min read
రైతులకు మరియు ప్రకృతి వ్యవసాయ కేడర్కు సీడ్ పెలెటైజేషన్ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన
ఈ విధానాన్ని తమ పొలాల్లో అమలు చేయడంతో పాటు ఇతర రైతులకు కూడా అవగాహన కల్పించాలి
ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: కామవరపుకోట మండలం ఆడమిల్లి గ్రామంలో శుక్రవారం సీడ్ పెలెటైజేషన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజరు బి.వెంకటేష్ పాల్గొని, అక్కడి రైతులకు మరియు ప్రకృతి వ్యవసాయ కేడర్కు సీడ్ పెలెటైజేషన్ ప్రాముఖ్యతపై రైతులకు అవగాహన కల్పించారు. అలాగే పిఎమ్ డిఎస్ నవధాన్యాలు ప్రాముఖ్యతను వివరించి, ప్రతి రైతు ఈ విధానాన్ని తమ పొలాల్లో అమలు చేయడంతో పాటు ఇతర రైతులకు కూడా అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విత్తనాలను గోమయం మరియు మట్టి మిశ్రమంతో విత్తన గుళికలుగా తయారు చేసి పొలాల్లో చల్లుకోవడం ద్వారా విత్తనాలు ఎక్కువకాలం సురక్షితంగా ఉండటమే కాకుండా,భూమిలో తేమ నిల్వ ఉండి మొలక శాతం పెరుగుతుందని తెలిపారు. రైతులు 25 రకాలు నవధాన్యాలు విత్తనాలను భూమిలో చల్లడం ద్వారా భూసారం పెరగడంతో పాటు సూక్ష్మజీవులకు ఎలాంటి హాని కలగకుండా పంట వైవిధ్యం అభివృద్ధి చెందుతుందని వివరించారు. అదేవిధంగా ప్రకృతి వ్యవసాయ కషాయాలు, జీవామృతాలు మరియు గ్రోత్ ప్రమోటర్లు ప్రతి బిఆర్ సి బయో రిసోర్స్ సెంటర్లో అందుబాటులో ఉంటాయని, అధిక పెట్టుబడులు లేకుండా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందవచ్చని రైతులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ హుస్సేన్,ఎం.టి.ఓ.గోపాల కృష్ణమూర్తి, రైతు సాధికార సంస్థ ఫీల్డ్ లెవల్ కేడర్ సభ్యులు, గ్రామ రైతులు,తదితరులు పాల్గొన్నారు.


