క్రీడలతో విద్యార్థులకు గుర్తింపుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
1 min read
-మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్
కర్నూలు, న్యూస్ నేడు: విభిన్న రకాల క్రీడలలో విద్యార్థులు రాణిస్తే వారికి గుర్తింపుతో పాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని రాజ్యసభ మాజీ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. ఈరోజు స్థానిక పెద్దపాడు రోడ్డు నందు ఉన్న పుష్పరాజ్ ఫంక్షన్ హాల్ నందు 13వ జాతీయ స్థాయి కరాటే ఛాంపియన్షిప్ 2026 పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం కూడా వస్తుంది అన్నారు. కరాటే క్రీడ ఏకగ్రతతో పాటు వ్యక్తిగత రక్షణకు ఎంతగానో దోహదం చేస్తుందని ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ చిన్నప్పటినుంచే ఏదో ఒక క్రీడలో సాధన చేస్తే వారికి మంచి క్రమశిక్షణతో పాటు, విద్య ఉద్యోగ అవకాశలలో కూడా ఎంతగానో దోహదం చేస్తాయని టీజీ వెంకటేష్ అన్నారు. జాతీయస్థాయి కరాటే పోటీలు కర్నూల్లో జరగడం ఇక్కడి వారికి అందరికీ ఎంతో గర్వకారణం అన్నారు. ఇటువంటి క్రీడలు నిర్వహించడానికి ఎంతో ఓర్పు శ్రమతో పాటు ఎన్నో వ్యయ ప్రయాసలకు కూడా ఉంటాయని టీజీ తెలిపారు. ఈ పోటీల నిర్వహణతో కర్నూలుకు జాతీయ, అంతర్జాతీయ గుర్తింపు లభిస్తుందని ఆయన తెలిపారు. జాతీయస్థాయి కరాటే పోటీల కార్యక్రమం నిర్వాకుడు జగదీష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ఉన్న 16 రాష్ట్రాల నుంచి 1500 మంది క్రీడాకారులు ఈ పోటీలలో పాల్గొంటున్నారని అన్నారు. దాదాపు 250 మంది రెఫరీల సమక్షంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో డి వెంకటేశ్వర్ రెడ్డి, డాక్టర్ మిల్టన్ శాస్త్రి, కొండూరు రిన్సి కీర్తన్, హరికిషన్ , సిటీ కేబుల్ జనరల్ మేనేజర్ ఎస్ కె మహేష్ పాల్గొన్నారు.



