రాయలసీమ హక్కుల అమలుకు తక్షణ కార్యాచరణ చేపట్టండి
1 min read
ప్రధాని మోడీకి లేఖ ద్వారా విజ్ఞప్తి చేసిన బొజ్జా దశరథరామిరెడ్డి
కర్నూలు, న్యూస్ నేడు: గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ అక్టోబర్ 16న ఉమ్మడి కర్నూలు జిల్లాకు విచ్చేయనున్న సందర్బంగా రాయలసీమ సాగునీటి సాధన సమితి అధ్యక్షులు బొజ్జా దశరథరామిరెడ్డి స్వాగతించారు. ఈ పర్యటన నేపథ్యంలో రాయలసీమ ప్రాంతానికి చట్టబద్ధంగా కల్పించబడిన హక్కులను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రధానమంత్రికి ఒక విజ్ఞాపన పత్రాన్ని మెయిల్ ద్వారా పంపారు.మంగళవారం నంద్యాల సమితి కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో బొజ్జా మాట్లాడుతూ..రాయలసీమ సమగ్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం వెంటనే చేపట్టాల్సిన కీలక అంశాలను లేఖలో పొందుపరిచినట్లుగా ఆయన తెలిపారు.రాష్ట్ర విభజన చట్టం ప్రకారం ప్రత్యేక ప్యాకేజీ తక్షణమే విడుదల చేయాలనీరాష్ట్రం విడిపోయి 11 సంవత్సరాలు గడిచినా, వెనుకబడిన రాయలసీమ జిల్లాలకు కేటాయించిన ప్రత్యేక ప్యాకేజీ నిధులను కేంద్రం విడుదల చేయడంలో విఫలమైందనీ, ఈ నిధులను వెంటనే విడుదల చేసి, రాయలసీమలో “పర్యావరణ పరిరక్షణ కమిషన్” ఏర్పాటు చేయాలని లేఖలో బొజ్జా విజ్ఞప్తి చేసారు. దీని ద్వారా చెరువుల నిర్మాణం-పునరుద్ధరణ, వాటిని వాగులు, వంకలు, కాలువలతో అనుసంధానం చేయాలని సామాజిక అడవుల పెంపకంతో పర్యావరణ పరిరక్షణ చేసి, పెన్నా నదిని పునరుద్ధరణ చేసే కార్యక్రమాలను చేపట్టాలని కోరారు.ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు వై.యన్.రెడ్డి, ఏరువ రామచంద్రారెడ్డి, న్యాయవాది అసదుల్లా, కెడిసిసి డైరక్టర్ బెక్కం రామసుబ్బారెడ్డి, చెరుకూరి వెంకటేశ్వర నాయుడు, కరిమద్దెల ఈశ్వరరెడ్డి, పట్నం రాముడు, కొమ్మా శ్రీహరి, కృష్ణమోహన్ రెడ్డి, జానోజాగో మహబూబ్ భాష, మనోజ్ కుమార్ రెడ్డి, రాఘవేంద్రగౌడ్, న్యాయవాది అసదుల్లా తదితరులు పాల్గొన్నారు.

