పక్కా ప్లాన్ ప్రకారమే టీడీపీ నేత ఇంతియాజ్ హత్య: మంత్రి టీజీ భరత్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలులో వైసీపీ రౌడీ మూకలు హత్యలు, హత్యాయత్నాలతో అరాచకాలు చేస్తున్నాయని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు. పక్కా పథకం ప్రకారమే టీడీపీ కార్యకర్త ఇంతియాజ్ బాషాను దారుణంగా హత్య చేశారని ఆరోపించారు. వైసీపీ రాజకీయ హత్యలకు పాల్పడుతోందని అన్నారు. కర్నూలులోని ఆయన కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ఎన్నికల్లో ఇంతియాజ్ బాషా ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారని మంత్రి తెలిపారు. తన నామినేషన్ను ఉపసంహరించుకోవాలని అప్పట్లో వైసీపీ వర్గీయులు ఇంతియాజ్ను బెదిరించారని, ఆయన ఇంటికి వెళ్లి గొడవకు దిగారని చెప్పారు. అనంతరం ఇంతియాజ్ టీడీపీలో చేరారని తెలిపారు. ఇంతియాజ్ బాషా హంద్రీ నదిలో వైసీపీ కబ్జాలను, అక్రమాలను బయటపెట్టారని మంత్రి పేర్కొన్నారు. వైసీపీ అక్రమాలను ప్రశ్నించినందుకే ఇంతియాజ్ను హత్య చేశారని ఆరోపించారు. గత రెండేళ్లలో కర్నూలులో మూడు హత్యలు జరిగాయని, ప్రతి హత్యలోనూ వైసీపీ ప్రమేయం ఉందని మంత్రి ఆరోపించారు. ఇంతియాజ్ను చంపుతామని పరోక్షంగా వారం రోజుల ముందే సోషల్ మీడియాలో పోస్టులు వచ్చినా ఇంటెలిజెన్స్ వర్గాలు ఎందుకు అంచనా వేయలేకపోయాయని ప్రశ్నించారు. ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుందో అర్థం కావడం లేదు. ఇప్పటికైనా పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలి” అని మంత్రి అన్నారు.గతంలో కావాలనే తన కార్యాలయం ఎదురుగా రెచ్చగొట్టే విధంగా వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారని టీజీ భరత్ తెలిపారు. ఈ విషయాన్ని పోలీసులకు చెప్పి, తన కార్యాలయం ఉన్న మార్గంలో కాకుండా ఇతర మార్గాల్లో నిరసనలు చేసుకునేలా చూడాలని కోరినప్పటికీ వైసీపీ నేతల ధోరణిలో మార్పు రాలేదన్నారు. పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకోవాలని సూచించారు.కర్నూలులో నెలకొన్న పరిస్థితులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని కలిసి వివరిస్తానని మంత్రి తెలిపారు. “వైసీపీ ధోరణి ఇలాగే ఉంటే చూస్తూ ఊరుకునేది లేదు” అని స్పష్టం చేశారు. 1994 నుంచి 2004 వరకు టీడీపీ ప్రభుత్వ హయాంలో కర్నూలులో ఫ్యాక్షనిజాన్ని అదుపులోకి తెచ్చామని టీజీ భరత్ గుర్తు చేశారు. అవసరమైతే మళ్లీ కఠిన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుందని అన్నారు. ఫ్యాక్షన్ రాజకీయాలను అంతమొందించినట్లే, ఇప్పుడున్న రౌడీ మూకలను కూడా తుడిచిపెట్టేలా కఠిన చర్యలు తీసుకుంటాం” అని మంత్రి టీజీ భరత్ స్పష్టం చేశారు.


