మున్సిపల్ నాన్ పిహెచ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి!
1 min read
ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్!
విజయవాడ, న్యూస్ నేడు: మే నెల ఏడో తేదీ నుండి మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న నాన్ పిహెచ్ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించి తామందరికీ నైపుణ్యం, అర్ధ నైపుణ్యంగావిభజించి జీతాలు చెల్లించాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ ఈదులమూడి మధుబాబు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం, గాంధీనగర్, ప్రెస్ క్లబ్ లో పాత్రికేయులతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమ్మె చేస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగం కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ వేయటం జరిగిందన్నారు.కమిషనర్ అండ్ డైరెక్టర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ సంపత్ కుమార్ రెండు దఫాలుగా యూనియన్ తో చర్చలు జరిపి సమస్యలు పరిష్కరించలేదన్నారు. జీతాలు పెంచే విషయంలో కూడా ఎటువంటి హామీ ఇవ్వకుండా మున్సిపల్ శాఖ మాత్యులు పి నారాయణతో చర్చలు ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చి ఈనెల రెండవ తేదీన సచివాలయంలోని రెండో బ్లాక్ లో మంత్రిగారితో చర్చలు ఏర్పాటు చేశారని ఈ చర్చలకు రావలసినదిగా అన్ని సంఘాలకు సి డి ఎం ఏ కార్యాలయం నుండి సమాచారం ఇచ్చి ఉన్నారని తెలుపుతూ చర్చల్లో అన్ని కార్మిక సంఘాలు గత ప్రభుత్వం పారిశుద్ధ్య కార్మికులకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులకు, చెత్త తరలించే డ్రైవర్లకు ఏదైతే 6వేల రూపాయలు జీతం పెంచిందో అదే మాదిరిగా 6వేల రూపాయలను మిగతా నాన్ పిహెచ్ ఉద్యోగులకు కూడా జీతం పెంచి ఆ తర్వాత నైపుణ్యం, అర్ధ నైపుణ్యంగా విభజించి జీతాలు పెంచాలని మంత్రి ని కోరగా అందుకు మంత్రిగారు నేను ముఖ్యమంత్రితో మాట్లాడి చెప్తానని చెప్పి చర్చలను అద్దాంతరంగా ముగించి తమను మభ్యపెట్టి వెళ్లిపోవడం జరిగిందన్నారు. ఇది సరైన పద్ధతి కాదు, కార్మిక సంఘాలను హేళన చేసే విధంగా ఉందని ఆవేదన వ్యక్తపరిచారు. అంతేకాకుండా ఏదైతే గత ప్రభుత్వం ఆప్కాస్ ద్వారా కార్మికులకు మేలు చేసిందో ఆప్కాస్ సంస్థను కొనసాగించాలని, అలాగే ప్రస్తుత ప్రభుత్వం ఎన్నికలకు ముందు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా అవుట్సోర్సింగ్ అందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలని, మున్సిపల్ రంగంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఉద్యోగులు, డ్రైవర్లు 24,500 జీతం తీసుకుంటున్నారు కాబట్టి వీరు ఈఎస్ఐ పరిధిలోకి రారు కాబట్టి మీ అందరికీ ప్రభుత్వం హెల్త్ కార్డులు మంజూరు చేసి వారందరికీ సంవత్సరానికి 30 ఆరోగ్య సెలవులు మంజూరు చేయాలని, లేదా మున్సిపల్ రంగంలో విధులు నిర్వహిస్తున్న వారందరికీ మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఇప్పటివరకు ఒక సంఘమే రాష్ట్రవ్యాప్తంగా సమ్మె చేస్తుంటే అన్ని సంఘాలు ఐక్యంగా లేవని భావన ప్రభుత్వంలో ఉంది కాబట్టి మున్సిపల్ ఇంజనీరింగ్ విభాగంలో రాష్ట్ర వ్యాప్తంగా ఎన్ని సంఘాలు ఉన్నాయో అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ హక్కులు సాధించుకుంటామని అవసరమైతే సమ్మె కూడా వెనకాడబోమని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు కే బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో విధులు నిర్వహిస్తున్న నాన్ పి హెచ్ ఉద్యోగులందరికీ టెక్నికల్ నాన్ టెక్నికల్ జీతాలు చెల్లించాలని, ఏదైతే మెప్మా డిపార్ట్మెంట్లో ఉన్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ మానవ వనరుల విధానంలోనికి తీసుకొచ్చారో ఆ విధానంలోనికి మున్సిపల్ రంగంలో విధులు నిర్వహిస్తున్న 42,వేల మంది ఔట్సోర్సింగ్ ఉద్యోగులను తీసుకురావాలని, ఉద్యోగులందరికీ వార్షిక ఇంక్రిమెంట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర జేఏసీ వైస్ చైర్మన్ పి మహేష్ బాబు, సెక్రటరీ ఎం శ్రీనివాసులు, కన్వీనర్ పి రాజేష్, కో కన్వీనర్ వి జైపాల్, విజయవాడ నగరపాలక సంస్థ లో ఔట్సోర్సింగ్ పద్ధతిపై విధులు నిర్వహిస్తున్న వాటర్ సప్లై, స్ట్రీట్ లైట్ విభాగాల్లోని ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు.
