నవధాన్యాల విత్తనాల వినియోగం రైతులకు అనేక విధాలుగా ప్రయోజనం
1 min read
కలుపు మొక్కల పెరుగుదల నియంత్రణలో పాటు నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడుతుంది
నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో ఎండకాల పరిస్థితులను తట్టుకునే శక్తి పంటలకు పెరుగుతుంది
జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: రుతుపవనాలకు ముందు పొడి విత్తనాలు నాటడం,pre-monsoon dry sowing – (PMDS), (ప్రేమ మొన్సూన్ డ్రై సౌయింగ్ పి యం డి ఎస్ నవధాన్యాల విత్తనాల వినియోగం రైతులకు అనేక విధాలుగా ప్రయోజనాలను అందిస్తుందని జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా చెప్పారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలం గుండుగొలనుకుంట గ్రామంలోని శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర మెగా బయో ఇన్పుట్స్ రిసోర్స్ సెంటర్ (బిఆర్ సి) లో యజమాని ఓబిలిశెట్టి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయానికి ఎంతో ఉపయోగకరమైన పీఎండిఎస్ (నవధాన్యాలు) సీడ్ కిట్ల తయారీ కార్యక్రమం బుధవారం నిర్వహించారు. మొదటి విడతగా 800 పిఎమ్ డిఎస్ కిట్లు సిద్ధం చేయగా, ప్రతి కిట్లో 25 రకాల విత్తనాలు, మొత్తం 15 కిలోల విత్తన ఉత్పత్తి ఉండి, ఒక్కో కిట్ను రూ.1400 కు రైతులకు అందించారు. ఈ సందర్భంగా హబీబ్ భాషా మాట్లాడుతూ నవధాన్యాల పంటలను సాగు చేయడం ద్వారా భూమి ఎర్రదనాన్ని తగ్గించి, సంవత్సరం పొడవునా భూమి పచ్చదనంతో కప్పబడి ఉండేలా చేస్తుందన్నారు. దీని వలన కలుపు మొక్కల పెరుగుదల నియంత్రణలో ఉండటంతో పాటు నేలలో సేంద్రియ కార్బన్ శాతం పెరిగి భూసారం మెరుగుపడుతుందని, అదేవిధంగా భూమి గుల్లగా మారి నీటి నిల్వ సామర్థ్యం పెరగడంతో ఎండకాల పరిస్థితులను తట్టుకునే శక్తి పంటలకు పెరుగుతుందన్నారు. ఇంకా ఈ నవధాన్యాల పంటలు పురుగులు, తెగుళ్లను తగ్గించడంలో ఎంతో ఉపయోగపడతాయని, నేలలో సూక్ష్మజీవుల కార్యకలాపాలు, వానపాముల సంఖ్య పెరిగి జీవవైవిధ్యం అభివృద్ధి చెందుతుందని,. వేర్ల వ్యవస్థ బలపడటంతో లోతైన కండరాలు కాపాడబడి, వాతావరణ మార్పులకు అనుగుణంగా పంట నిలబడే శక్తి పెరుగుతుందన్నారు. అలాగే పంట దిగుబడులు, నాణ్యత, పోషక విలువలు పెరిగి రైతుకు అధిక ఆదాయం లభిస్తుందని, ఈ నవధాన్యాల పంటలు పశువులకు పోషక విలువలతో కూడిన పచ్చిమేతగా ఉపయోగపడటంతో పాలు ఉత్పత్తి మరియు పాలు నాణ్యత కూడా మెరుగుపడుతుందని, రసాయన ఎరువులు, పురుగుమందుల అవసరం తగ్గి ప్రకృతి వ్యవసాయం మరింత బలోపేతం అవుతుందన్నారు. 365 రోజులు భూమి కప్పబడి ఉండటం వల్ల నేల నష్టం తగ్గి, భూతాపాన్ని తగ్గించడంలోనూ, ప్రకృతి విపత్తులను తట్టుకునే శక్తిని పెంచడంలోనూ పీఎండీఎస్ నవధాన్యాల కిట్లు కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ఈ కార్యక్రమం రైతుల్లో మంచి స్పందన తెచ్చి, ఆర్థికంగా మరియు పర్యావరణపరంగా లాభదాయకమైన ప్రకృతి వ్యవసాయానికి ఇది మరో ముందడుగుగా నిలుస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా, జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి. వెంకటేష్ సీడ్ కిట్ల తయారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు.


