సంపూర్ణ అవగాహనతోనే స్వీయ ఆరోగ్య సంరక్షణ సాధ్యo
1 min read
జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు
ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోపక్క వైద్య శిబిరాలను ఏర్పాటు
ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: సంపూర్ణ అవగాహనతోనే స్వీయ ఆరోగ్య సంరక్షణ సాధ్యమని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు,ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి హితవు పలికారు. దాన్ని దృష్టిలో ఉంచుకుని ఒకపక్క ఆరోగ్య సంరక్షణపై ప్రజలకు అవగాహన కల్పిస్తూనే, మరోపక్క వైద్య శిబిరాలను ఏర్పాటుచేసి వారిని ఆరోగ్యవంతులుగా తీర్చిదద్దే బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఏలూరు పవర్ పేటలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రతి గురువారం ఉచిత వైద్య శిబిరం నిరాటంకంగా కొనసాగుతోంది. దీనిలో భాగంగా ఈ గురువారం కూడా అక్కడ నిర్వహించిన వైద్య శిబిరాన్ని అవసరార్ధులు సద్వినియోగం చేసుకున్నారు. సాధారణ వ్యాధులకు వైద్య సహాయం పొందారు. తొలుత వైద్య శిబిరానికి వచ్చిన వారిని వైద్యులు పరీక్షించి, అవసరమైన వారికి రెడ్క్రాస్ ఆధ్వర్యంలో 40 రకాల రక్త పరీక్షలను ఉచితంగా చేశారు. అనంతరం వారికి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఇదేసమయంలో వైద్య శిబిరం కొనసాగుతోన్న తీరును స్వయంగా పరిశీలించిన ఎమ్మెల్యే బడేటి చంటి అత్యవసర వైద్య సేవలు అవసరమైన వారిని అత్యాధునిక వైద్య సౌకర్యాలు కలిగిన ఆసుపత్రికి రిఫర్ చేయాలని వైద్య సిబ్బందికి సూచించారు. అలాగే అవసరార్థులకు ఉచితంగా మందులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ ఆరోగ్య సంరక్షణపై అవగాహనా రాహిత్యంతో వ్యవహరిస్తూ సంబంధిత నిష్ణాతులైన వైద్యులతో సరిగా చికిత్స చేయించుకోకుండా ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని ప్రజలకు హితవు పలికారు. ప్రజా అవసరాలను తీర్చే బాధ్యతను ముఖ్యమంత్రి చంద్రబాబు పదేపదే గుర్తుచేస్తూ స్ఫూర్తిని కలిగిస్తున్నారన్నారు. దాంతో తాను మెడికల్ క్యాంపు నిర్వహణకు శ్రీకారం చుట్టడం జరిగిందన్న ఆయన నిష్ణాతులైన వైద్యులు ఈ శిబిరంలో వైద్యసేవలు అందించేలా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. అత్యవసర వైద్య సహాయం కావాల్సిన వారిని అన్నివసతులు కలిగిన ఆసుపత్రికి పంపించడం జరుగుతుందని తెలిపారు. ఆ విషయంలో కూడా ఇక్కడి సిబ్బంది ప్రజలకు సంపూర్ణ అవగాహన కల్పించి చైతన్యవంతుల్ని చేశాలా పటిష్ట చర్యలు చేపట్టామన్న ఎమ్మెల్యే బడేటి చంటి ప్రతి గురువారం తన క్యాంపు కార్యాలయంలో నిర్వహించే వైద్య సేవలను అవసరార్థులంతా సద్వినియోగం చేసుకోవాలని మరోసారి సూచించారు.కార్యక్రమంలో టిడిపి నగర అధ్యక్షులు చోడే వెంకటరత్నం,కార్యదర్శి రెడ్డి నాగరాజు,నాయకులు బెల్లపుకొండ కిషోర్,అమరావతి అశోక్,లంకపల్లి మాణిక్యాలరావు,పిల్లారిశెట్టి సంధ్య,మల్లెపు రాము తదితరులు పాల్గొన్నారు.

