NEWSNEDU

NEWSNEDU | Telugu Latest News | KURNOOL AP

హొళగుందలో ఘనంగా 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

1 min read

150 మీటర్ల జాతీయ జెండాతో దేశభక్తి ర్యాలీ

స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న గ్రామ ప్రజలు

హొళగుంద న్యూస్ నేడు: హొళగుంద గ్రామ ప్రజల ఆధ్వర్యంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను శనివారం హొళగుంద బస్టాండ్ ఆవరణలో ఘనంగా నిర్వహించారు. దేశభక్తి, జాతీయ సమైక్యతను చాటుతూ నిర్వహించిన ఈ వేడుకల్లో గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా హొళగుంద ఎస్‌ఐ దిలీప్ కుమార్ జాతీయ జెండాను ఆవిష్కరించి, జాతీయ పతాకానికి గౌరవ వందనం సమర్పించారు. అనంతరం జాతీయ గీతాన్ని ఆలపిస్తూ దేశభక్తి భావాన్ని చాటుకున్నారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారికి ఘన నివాళులు అర్పించారు.అనంతరం గ్రామ ప్రజల ఆధ్వర్యంలో సుమారు 150 మీటర్ల జాతీయ జెండాతో ప్రత్యేక దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. హొళగుంద బస్టాండ్ నుంచి ప్రధాన వీధుల మీదుగా సాగిన ఈ ర్యాలీలో యువత, గ్రామ ప్రజలు జాతీయ జెండాలను చేతబట్టి దేశభక్తి నినాదాలతో ఉత్సాహంగా పాల్గొన్నారు. దీంతో గ్రామంలో దేశభక్తి వాతావరణం నెలకొంది.

దేశ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: ఎస్‌ఐ దిలీప్ కుమార్ గురజాల

ఈ సందర్భంగా ఎస్‌ఐ దిలీప్ కుమార్ గురజాల మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని అన్నారు. వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు.దేశ అభివృద్ధి, శాంతి, సోదరభావం, జాతీయ సమైక్యత కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. యువత దేశ భవిష్యత్తుకు దిక్సూచి వంటిదని, విద్య, క్రమశిక్షణ, సామాజిక బాధ్యతతో ముందుకు సాగుతూ దేశ ప్రగతిలో భాగస్వాములు కావాలని సూచించారు. కుల, మత, ప్రాంత భేదాలకు అతీతంగా అందరూ ఐక్యంగా ఉండి దేశ సమగ్రతను కాపాడాలని పేర్కొన్నారు.

దేశభక్తి, సోదరభావాన్ని పెంపొందించాలి: మౌలానా సైఫుల్లా జామాయి

మౌలానా సైఫుల్లా జామాయి మాట్లాడుతూ భారతదేశ స్వాతంత్ర్యం కోసం అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా పోరాడారని, స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాల ఫలితంగానే మనం నేడు స్వేచ్ఛా వాతావరణంలో జీవిస్తున్నామని అన్నారు. దేశంలో శాంతి, సోదరభావం, ఐక్యతను కాపాడుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత అని పేర్కొన్నారు.యువత దేశభక్తి స్ఫూర్తితో ముందుకు సాగుతూ విద్య, సేవా కార్యక్రమాలు, సామాజిక బాధ్యతల ద్వారా దేశ అభివృద్ధికి తోడ్పడాలని సూచించారు. జాతీయ సమైక్యతను చాటే కార్యక్రమాలను ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ఎస్‌ఐ దిలీప్ కుమార్ గురజాల, ఏఎస్‌ఐ, సామాజిక ప్రజాస్వామ్య పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ముల్లా ఇర్ఫాన్, ఆలూరు అసెంబ్లీ అధ్యక్షుడు ఎఫ్. అబ్దుల్ హమీద్, కె. సలామ్, వైఎస్సార్‌సీపీ మండల పరిషత్ అధ్యక్షుడు ఈసా, తెలుగుదేశం పార్టీ మండల మైనారిటీ అధ్యక్షుడు ముల్లా మొహిన్, అబ్దుల్ రహిమాన్, అమీన్ తదితరులు పాల్గొన్నారు.వీరితో పాటు గ్రామ ప్రజలు, యువత, మహిళలు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ జెండాకు గౌరవం చాటుతూ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. దేశభక్తిని, జాతీయ సమైక్యతను పెంపొందించే ఇటువంటి కార్యక్రమాలు ప్రతి సంవత్సరం మరింత వైభవంగా నిర్వహించాలని గ్రామ ప్రజలు ఆకాంక్షించారు.

About Author

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *