యూరియా .. డి.ఏ.పి,సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేయలి
1 min read
ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ అధికారులకు ఆదేశం
జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాసా జిల్లాలో ఉంగుటూరు,భీమడోలు, దెందులూరు,చింతలపూడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించారు
అక్రమ రవాణా,నిల్వలు,అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఏలూరు జిల్లాలో ఖరీఫ్- 2026 సీజన్ కు రైతులకు అవసరమైన ఎరువులు, ముఖ్యంగా యూరియా మరియు డి.ఏ.పి, సమృద్ధిగా అందుబాటులో ఉండేలా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేయాలనీ ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం బృందంలో ఢిల్లీకి చెందిన డిప్యూటీ డైరెక్టర్ అఫ్ ఫెర్టిలైజర్స్ రవీంద్ర యాదవ్ తో కలిసి హైదరాబాద్ ఎక్సెన్షన్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ కి చెందిన ప్రొఫెసర్ డి. మధుశేఖర్, జిల్లా వ్యవసాయ అధికారి హబీబ్ భాసా ఏలూరు జిల్లాలో ఉంగుటూరు, భీమడోలు, దెందులూరు, చింతలపూడి మరియు ఏలూరు మండలాల్లో పర్యటించారు, ఎరువుల రిటైల్ డీలర్ల దుకాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రవీంద్ర యాదవ్ మాట్లాడుతూ ఏప్రిల్-2026 నెలలో యూరియా మరియు డి.ఏ.పి ఎరువుల అమ్మకాలు అధికంగా నమోదైన నేపథ్యంలో, ఆ పెరుగుదలకు గల కారణాలను సమగ్రంగా పరిశీలించడం జరుగుతుందన్నారు.డీలర్ల వద్ద ఉన్న స్టాక్ వివరాలు,విక్రయ రికార్డులు, బిల్లులు,రైతులకు సరఫరా విధానం వంటి అంశాలను పరిశీలించి,సరైన మార్గదర్శకాలు అందించారు. కేంద్ర బృందంలోని అధికారులు ఎరువుల నిల్వలు సమృద్ధిగా ఉంచాలని,ఎటువంటి అక్రమ రవాణా,నిల్వలు, అధిక ధరలకు అమ్మకాలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే రైతులకు ఎరువులు సరైన సమయంలో, సరైన మోతాదులో అందేలా చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు అవసరమైన మేరకు మాత్రమే ఎరువులను కొనుగోలు చేసి, సమతుల్య ఎరువుల వినియోగాన్ని పాటించాలని, అనవసర నిల్వలు చేయకుండా ఉండాలన్నారు.జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ భాషా మాట్లాడుతూ ఏలూరు జిల్లా వ్యవసాయ శాఖ రైతులకు అవసరమైన అన్ని ఎరువులను అందుబాటులో ఉంచామని,ఎటువంటి సమస్యలు తలెత్తకుండా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నామని బృందంలోని అధికారులకు తెలియజేసారు.

