ఎస్వీ గారు వాస్తవాలు మాట్లాడండి
1 min read
టిడిపి జిల్లా నూతన కార్యాలయం భవన నిర్మాణం పై అబద్ధాలు సరికాదు
జిల్లా టిడిపి అధ్యక్షులు గుడిసె ఆది కృష్ణమ్మ
కర్నూలు, న్యూస్ నేడు : తెలుగుదేశం పార్టీ శాశ్వత భవనం నిర్మాణానికి సంబంధించిన భూమి పూజ, శంకుస్థాపన కార్యక్రమం పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమక్షంలో అత్యంత ఘనంగా జరిగిందని,అయితే అదే కార్యక్రమంపై వైసీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ లో మాట్లాడిన తీరు పూర్తిగా అసత్య ప్రచారానికి నిదర్శనమన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షురాలు గుడిసె కృష్ణమ్మ.గురువారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ టిడిపి పై విమర్శలు చేయడం వైసిపి నాయకులకు కొత్తేమి కాదన్నారు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి మొదలుకొని రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వారి నాయకులు, కార్యకర్తలు, పేటియం బ్యాచ్ల వరకు అందరికీ ఒకే అలవాటు. అబద్ధాలను పదేపదే ప్రచారం చేసి ప్రజలను తప్పుదారి పట్టించడమని ఆమె దుయ్యబట్టారు. పచ్చని చెట్లను నరుకుతూ రెండు ఎకరాల స్థలంలో టిడిపి కార్యాలయ భవన నిర్మాణం చేపడుతున్నారని ఎస్ వి మోహన్ రెడ్డి చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. ఒకటిన్నర ఎకరాలు స్థలంలో ప్రభుత్వ అనుమతి పొంది కార్యాలయం నిర్మాణానికి భూమి పూజ చేశామని ఈ సందర్భంగా ఆమె తెలిపారు.ఇది ఈరోజు మొదలైన అంశం కాదు. గత పది సంవత్సరాలుగా మా పార్టీ పెద్దలు, అప్పటి జిల్లా అధ్యక్షులు, నాయకులు నిరంతరం ఆ స్థలం కోసం ప్రభుత్వాన్ని కోరుతూ వస్తున్నారు. ప్రజలకు సేవ చేసే రాజకీయ పార్టీకి శాశ్వత కార్యాలయం అవసరమనే ఉద్దేశంతోనే ఈ ప్రయత్నం కొనసాగుతోంది.ప్రజల సమస్యలపై మాట్లాడాల్సిన వైసీపీ నాయకులు వాస్తవాలు తెలుసుకోకుండా విమర్శలు చేయడం దురదృష్టకరం. అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేతం చూసి ఓర్వలేకనే ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తున్నారని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలకు ఉపయోగపడే శాశ్వత పార్టీ కార్యాలయం నిర్మాణం కోసం జరుగుతున్న కార్యక్రమాన్ని రాజకీయ విమర్శల కోసం వక్రీకరించడం మానుకోవాలని హితవు పలికారు.

