చారిత్రక రాతప్రతుల సంరక్షణ కు చర్యలు చేపట్టండి– జిల్లా కలెక్టర్
1 min read
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో చారిత్రక రాతప్రతులను సేకరించి, వాటి సంరక్షణ కు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి సంబంధిత అధికారులను ఆదేశించారు.జిల్లాలో ప్రాచీన రాత ప్రతుల సేకరణ, సంరక్షణ,డిజిటలైజేషన్ అంశానికి సంబంధించి జిల్లా కలెక్టర్ జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భారత ప్రభుత్వ సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో, మన దేశ అమూల్యమైన రాతప్రతుల తాళ పత్రాలు సంరక్షణను ప్రోత్సహించడం కోసం “ జ్ఞాన భారతం ‘అనే ప్రతిష్టాత్మక కార్యక్రమం ప్రారంభించబడిందని తెలిపారు. “జ్ఞాన భారతము” కార్యక్రమం భాగంగా జిల్లాలో మనుస్క్రిప్ట్స్ (పురాతన గ్రంథాలు/తాళపత్ర గ్రంథాలు) సర్వే కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టాలని సూచించారు. జిల్లాలోని ప్రజలు, పండితులు, గ్రంథాలయాలు, మ్యూజియంలు, మఠాలు మరియు ఇతర సంబంధిత సంస్థల వద్ద ఉన్న పురాతన మనుస్క్రిప్ట్స్ను గుర్తించి, వాటి వివరాలు, ప్రతులను సంబంధిత ఆన్లైన్ పోర్టల్లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు.ఈ కార్యక్రమం ద్వారా మన ప్రాచీన జ్ఞాన సంపదను సంరక్షించడం, డిజిటలైజేషన్ ద్వారా భవిష్యత్ తరాలకు అందుబాటులో ఉంచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.సమావేశంలో జడ్పీ సీఈఓ రమణా రెడ్డి,సెట్కూరు సీఈఓ డా || వేణుగోపాల్, జిల్లా టూరిజం అధికారి జి. లక్ష్మీ నారాయణ,పురావస్తు శాఖ అధికారి మహేంద్ర నాయుడు, తెలుగు అధ్యాపకులు డా || పార్వతి, చరిత్ర అధ్యాపకులు డా || జయ లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

