ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను పటిష్టంగా నిర్వహించండి
1 min read
మే 21వ తేది నుండి జూన్ 2వ తేది వరకు సప్లిమెంటరీ పరీక్షలు
మొదటి సంవత్సరం సప్లిమెంటరీ పరీక్షలు వ్రాయనున్న 10,115 మంది విద్యార్థులు
ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలకు వ్రాయనున్న 5,928 మంది విద్యార్థులు
43 పరీక్షా కేంద్రాల్లో పరీక్షల నిర్వహణ
జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్
నంద్యాల, న్యూస్ నేడు: ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్ లోని డిఆర్ఓ ఛాంబర్ లో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ పై డిఆర్ఓ సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆర్ఐఓ శంకర్ నాయక్, ఎఓ సుభాకర్, డిఈసి మెంబర్లు సునీత, శ్రీకాంత్ సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి డి.రాము నాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సర సప్లిమెంటరీ పరీక్షలు ఈ నెల 21వ తేది నుంచి జూన్ 2వ తేది వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఉ.9.గం.ల నుండి మ.12.గం.ల వరకు మొదటి సంవత్సర పరీక్షలు, మ.2:30.గం.ల నుండి సా.5:30 గం.లకు ద్వితీయ సంవత్సర పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు. మొదటి సంవత్సరానికి సంబంధించి 10,115 మంది విద్యార్థులు, ద్వితీయ సంవత్సరానికి సంబంధించి 5,928 విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం జరుగుతుందన్నారు. పరీక్షల నిర్వహణ నిమిత్తం 43 పరీక్షా కేంద్రాల్లో నిర్వహించడం జరుగుతుందన్నారు.వైద్యశాఖ అధికారులు ప్రతి పరీక్షా కేంద్రం వద్ద ఆశా, ఎఎన్ఎంలతో మెడికల్ కిట్స్ ఏర్పాటు చేయాలని వైద్య సిబ్బందిని డిఆర్ఓ ఆదేశించారు. పరీక్షా సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుండి పరీక్షా కేంద్రాలకు వచ్చే విద్యార్థులకు ఇబ్బంది లేకుండా బస్సులను నడపాలని ఆర్టీసీ అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. పరీక్షా కేంద్రాల పరిసరాల్లోని జిరాక్స్ సెంటర్స్ మూసి ఉంచేలా చూడాలన్నారు. అదే విధంగా పరీక్షా కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను డిఆర్ఓ ఆదేశించారు. సున్నిత/సమస్యాత్మక పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. పరీక్షా పూర్తి అయిన తర్వాత పరీక్షా పత్రాలను ఎప్పటికపుడు పంపేలా చర్యలు తీసుకోవాలన్నారు.

