ఎరువులు అధిక ధరలకు విక్రయిస్తే కఠిన చర్యలు
1 min read
స్టాక్ బ్లాక్ చేసినా సహించము : ఏఓ ఆనంద్ లోకదళ్ హెచ్చరిక
రైతులకు అవసరమైన మేర ఎరువుల నిల్వలు ఉంచాలని సూచన
ఆధార్ ధృవీకరణతో పారదర్శకంగా ఎరువుల విక్రయాలు చేయాలి
హోలగుంద న్యూస్ నేడు; ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎరువులు, విత్తనాలు మరియు పురుగుమందులు సరఫరా చేయాలని, అధిక ధరలకు విక్రయించినా లేదా స్టాక్స్ బ్లాక్ చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని వ్యవసాయ అధికారి (ఏఓ) ఆనంద్ లోకదళ్ హెచ్చరించారు.సోమవారం మండలంలోని అగ్రి ఇన్పుట్ డీలర్లు, ముఖ్యంగా ఎరువుల వ్యాపారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నందున రైతులు సాగు పనులకు సిద్ధమవుతున్నారని, అందువల్ల రైతుల అవసరాలకు అనుగుణంగా తగినంత ఎరువుల నిల్వలు ఉంచుకోవాలని సూచించారు. ముఖ్యంగా యూరియా, డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులు అందుబాటులో ఉండేలా చూడాలని తెలిపారు.రైతుల నుంచి ఆధార్ కార్డు, పాస్బుక్ జిరాక్స్ ప్రతులను సేకరించి, వారి అవసరానికి అనుగుణంగా మొదటి, రెండో, మూడో విడతల వారీగా ఎరువులు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే ప్రతి విక్రయంలో ఆధార్ ధృవీకరణ తప్పనిసరిగా చేయాలని స్పష్టం చేశారు.అదేవిధంగా దుకాణాల ముందు విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల స్టాక్ వివరాలను రైతుల సౌకర్యార్థం స్పష్టంగా ప్రదర్శించాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు కలిగించే విధంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని AO ఆనంద్ లోకదళ్ హెచ్చరించారు.

