ఎస్ఐఆర్పై అప్రమత్తంగా ఉండాలి – ప్రతి ఓటును కాపాడుకోవాలి: ఎమ్మెల్యే
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు నియోజకవర్గం దేవనకొండ మండలంలోని అలారుదిన్నె, కుంకునూరు, కొత్తపేట, కరిడికొండ, వరిముక్కల, కూకటికొండ, వెలమకూరు, సింగపురం గ్రామాలలో ఎస్ఐఆర్ (Special Intensive Revision) ప్రక్రియపై వైఎస్సార్సీపీ బూత్ లెవల్ ఏజెంట్లు (BLAలు) మరియు పార్టీ నాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆలూరు ఎమ్మెల్యే బుసినే పాల్గొని దిశానిర్దేశం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బుసినే విరుపాక్షి మాట్లాడుతూ, రాబోయే నాలుగు వారాలు అత్యంత కీలకమైనవని, ఎస్ఐఆర్ ప్రక్రియను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయరాదని సూచించారు. ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోతే అర్హులైన ఓటర్ల పేర్లు తొలగిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.పార్టీకి చెందిన సీనియర్ నాయకులు, మండల మరియు గ్రామ స్థాయి బాధ్యులు ప్రతిరోజూ ఎస్ఐఆర్ ప్రక్రియను సమీక్షిస్తూ బూత్ స్థాయిలో పరిస్థితులను పరిశీలించాలని ఆదేశించారు. ప్రతి గ్రామంలో బీఎల్ఏలు ఇంటింటికీ వెళ్లి ఓటరు వివరాలను పరిశీలించి, అర్హులైన ప్రతి ఓటు జాబితాలో కొనసాగేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.ప్రజాస్వామ్యంలో ఓటు అత్యంత విలువైన హక్కు అని, ప్రతి ఓటును కాపాడుకోవడం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు బీఎల్ఏల బాధ్యత అని పేర్కొన్నారు. ఓటర్లకు అవగాహన కల్పిస్తూ, ఎలాంటి పొరపాట్లు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని కోరారు.ఈ సమావేశంలో మండల కన్వీనర్, రాష్ట్ర మరియు జిల్లా కమిటీ సభ్యులు, మండల కమిటీ సభ్యులు, సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీ సభ్యులు, బూత్ ఏజెంట్లు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్ఏలు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

