ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో జవాబుదారీతనం పెరగాలి
1 min read
ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్
జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం
ఏలూరు జిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ప్రభుత్వ అధికారులు, సిబ్బందిలో విధి నిర్వహణలో మరింత జవాబుదారీతనం పెరగాలని ఏలూరు పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ చెప్పారు. స్థానిక కలెక్టరేట్ లోని గోదావరి సమావేశపు హాలులో బుధవారం జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ (దిశ) సమావేశం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ ఘంటా పద్మశ్రీ, జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జేసీ ఎం.జె. అభిషేక్ గౌడ, ప్రభృతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గత సమావేశంలో లేవనెత్తిన అంశాలపై తీసుకున్న చర్యలు, ప్రస్తుత సమస్యలపై ఎంపీ అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ మాట్లాడుతూ పేదల జీవన ప్రమాణాల స్థాయి ని మెరుగుపరిచేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయని, వాటిని సక్రమంగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ అధికారులపై ఉందన్నారు. ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల కల్పన కోసం తన వద్దకు వచ్చిన ప్రజల అర్జీలను సంబంధిత శాఖల అధికారులకు పంపడం జరుగుతున్నదని, వాటిపై కొన్ని శాఖల అధికారులు ఎటువంటి చర్య తీసుకోకపోవడమే కాకుండా కనీసం జవాబు కూడా ఇవ్వడం లేదని, ఇది చాలా విచారించదగిన విషయమన్నారు. తనకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే గ్రామాలలో నిరక్షరాస్యులు, పేదలకు ఎటువంటి సేవలందుతున్నాయో ఊహించుకోవచ్చన్నారు.రానున్న 20 సంవత్సరాల అవసరాలకు సరిపోయే విధంగా ఏలూరు రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు ఉండేలా చేపట్టాలని, అవసరమైతే ప్రతిపాదనలు సవరించి సమర్పించి, పనులు పూర్తి నాణ్యతతో చేపట్టి, కొత్త స్టేషన్ మాదిరిగా రూపొందించాలన్నారు. రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు సక్రమంగా చేపట్టకపోతే విజిలెన్స్ విచారణ చేయిస్తానని ఎంపీ హెచ్చరించారు. జిల్లాలో చేపట్టిన రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ల నిర్మాణ పనులు 6 నెలల నుండి ఎటువంటి పురోగతి లేదని రైల్వే అధికారులపై ఎంపీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ అధికారులతో సమన్వయము చేసుకుని రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులు త్వరితగతిన పూర్తి చెయ్యాలని రైల్వే అధికారులను ఎంపీ ఆదేశించారు. పార్లమెంట్ నియోజకవర్గ అభివృద్ధి నిధులతో చేపట్టే పనులు ఏ ఆర్ధిక సంవత్సరంలో మంజూరైన పనులను అదే సంవత్సరంలో పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రణాళికా శాఖాధికారులను ఎంపీ ఆదేశించారు.జిల్లాలోని పరిశ్రమల నుండి కార్పొరేట్ సామజిక బాధ్యత నిధుల నుండి పలు కార్యక్రమాలు చేపట్టామని ఎంపీ కి తెలియజేసారు. నూజివీడు సబ్ కలెక్టర్ బి. వినూత్న, ఇంచార్జ్ డిఆర్ఓ దేవకీదేవి, జిల్లా పరిషత్ సీఈఓ జగదాంబ, ఆర్డీఓ లు లక్ష్మి ప్రసన్న, రమణ, డిపిఓ మల్లికార్జునరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.


