అతిసార వ్యాధి నివారణపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి
1 min read
స్టాప్ డయేరియా కాంపెయిన్’ పోస్టర్ ను విడుదల జేసిన జాయింట్ కలెక్టర్ పి.ధాత్రిరెడ్డి
ఏలూరు జిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : అతిసార వ్యాధి నివారణపై ప్రజలకు అవగాహన కలిగించేందుకు ఈనెల 16వ తేదీ నుండి జులై, 31 వ తేదీ వరకు విస్తృతంగా కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ పి . ధాత్రిరెడ్డి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం ‘స్టాప్ డయేరియా కాంపెయిన్’ పై ముద్రించిన గోడపత్రికను జేసీ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా జేసీ ధాత్రిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుత వర్షాకాలంలో కలుషిత నీటి కారణంగా అతిసార వ్యాధి ప్రబలే అవకాశం ఉందని, దీని కారణంగా జిల్లాలో ఎటువంటి మరణాలు ముఖ్యంగా 5 సంవత్సరంలోపు వయస్సు కల పిల్లలు మరణాలు సంబంవించకుండా నివారించాలన్నది జిల్లా యంత్రాంగం లక్ష్యమన్నారు. ఈ లక్ష్యసాధన దిశగా అధికారులందరూ పనిచేయాలన్నారు. జిల్లాలోని గ్రామ, పట్టణ ప్రాంతాలలోని 1822 మంది ఆశా కార్యకర్తలు, 605 మంది ఏఎన్ ఎం లు, 463 మంది ఎం.ఎల్. హెచ్.పి లు ఇంటింటికి సర్వే నిర్వహించి 5 సంవత్సరాలలోపు వయస్సు కలిగిన లక్షా 44 వేళా 422 మంది పిల్లలకు రెండు ఓ.ఆర్. ఎస్.ప్యాకెట్లు,14 జింక్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు.అతిసార వ్యాధి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత, సురక్షితమైన త్రాగునీరు తీసుకోవడం తోపాటు, అతిసార వ్యాధి సోకితే తీసుకోవలసిన జాగ్రత్తలపై తదితర విషయాలపై ప్రజలకు అవగాహన కలిగించాలన్నారు. అతిసార వ్యాధి నివారణపై ప్రచురించిన పోస్టర్ ను అన్ని ప్రధాన కూడళ్లలో ప్రదర్శించాలన్నారు. అంగన్వాడీ సిబ్బంది వారి పరిధిలో పోషకాహార లోపం, డయేరియా తో బాధపడుతున్నవారి వివరాలను దగ్గరలోని ఆరోగ్య సిబ్బందికి తెలియజేసి , వారికి చికిత్స అందించేలా చూడాలన్నారు. త్రాగునీరు కలుషితం కాకుండా ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించేలా పట్టణ ,గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలల్లో విద్యార్థులకు వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగించాలన్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో 24 గంటలు పనిచేసేలా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని, డయేరియా కేసులు, అంటువ్యాధులు ప్రబలినవారు తీసుకోవలసిన చర్యలను గురించి 9912341488 నెంబర్ కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా:మాలిని, జిల్లా వైద్య సేవల సమన్వయాధికారి డా:పాల్ సతీష్, జిల్లా ఇమ్మునైజేషన్ ఇంచార్జ్ అధికారి డా:రాజీవ్, డిఆర్ డిఎ పిడి డా:విజయ రాజు ప్రభృతులు పాల్గొన్నారు.