మహిళకు అడ్రినల్ గ్రంధిలో కణితి!
1 min read
10 లక్షల మందిలో 2-8 మందికే వచ్చే అరుదైన సమస్య
దీనివల్ల అసాధారణంగా పెరిగిపోయిన రక్తపోటు
లాపరోస్కొపిక్ ద్వారా తొలగించిన కర్నూలు కిమ్స్ వైద్యులు
కర్నూలు హాస్పిటల్, న్యూస్ నేడు : కర్నూలు నగరానికి చెందిన రూపారాణి అనే 35 ఏళ్ల మహిళకు అడ్రినల్ గ్రంధిలో కణితి ఏర్పడి అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడింది. కర్నూలు కిమ్స్ ఆస్పత్రిలో లాపరోస్కొపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఆ కణితిని తొలగించారు. ప్రతి పది లక్షల మందిలో కేవలం 2-8 మందికి మాత్రమే వచ్చే అత్యంత అరుదైన ఈ తరహా కణితుల వల్ల అనేక ప్రమాదాలు ఉంటాయి. ఈమెకు చికిత్స అందించిన యూరాలజీ విభాగాధిపతి డాక్టర్ వై. మనోజ్కుమార్ ఇందుకు సంబంధించిన వివరాలు మీడియాకు తెలిపారు. “రూపారాణి గర్భం దాల్చినప్పుడు ఆమెకు రక్తపోటు, షుగర్ లెవల్స్ అసాధారణంగా పెరిగిపోయింది. ఆ తరువాత వివిధ పరీక్షల అనంతరం అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేసినప్పుడు అడ్రినల్ గ్రంధిలో కణితి ఉన్నట్లు గుర్తించాం. మరిన్ని పరీక్షలు చేయగా, అది ఫెయోక్రోమోసైటోమా అనే కణితి అని, దాన్నుంచి హార్మోన్లు స్రవించడం వల్ల ఆమె రక్తపోటు గణనీయంగా పెరిగిపోయిందని అర్థమైంది. రూపారాణికి రక్తపోటు తగ్గించడానికి మూడు వేర్వేరు రకాల మందులు వాడాల్సి వచ్చింది. అయినా తగ్గకపోవడంతో పరీక్షించినప్పుడు ఈ కణితి కారణం అని తెలిసింది. దాంతో ఆమె ప్రాణాలు కాపాడేందుకు శస్త్రచికిత్స చేసి కణితి తొలగించాలని నిర్ణయించాం. ఆ తర్వాత పూర్తిగా బిపీ, షుగర్ లెవల్స్ తగ్గిపోయాయి. మందులు కూడా వాడాల్సిన అవసరం లేకుండా పోయింది కేవలం 2 సెంటీమీటర్ల మేర మాత్రమే రంధ్రం చేసి, లాప్రోస్కొపిక్ పద్ధతిలో శస్త్రచికిత్స చేసి, ఆ కణితిని అత్యంత జాగ్రత్తగా తొలగించాం. ఇదంతా ఒక బృందంగా మా వైద్యులు సాధించిన ఘనత” అని డాక్టర్ వై. మనోజ్ కుమార్ వివరించారు.