ముగిసిన సచివాలయ కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్
1 min read

కర్నూలు, న్యూస్ నేడు: ఆదివారం ఉమ్మడి కర్నూలు జిల్లాకు సంబంధించి పట్టణ ప్రాంతాల్లోని సచివాలయాల కార్యదర్శుల బదిలీల కౌన్సిలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. నగరపాలక సంస్థ కమిషనర్ యస్.రవీంద్ర బాబు అధ్వర్యంలో రెండు రోజుల పాటు కౌన్సిలింగ్ నిర్వహించారు. తొలిరోజు అడ్మినిస్ట్రేటివ్, వెల్ఫేర్, ఎడ్యుకేషన్, శానిటేషన్ కార్యదర్శులకు, రెండో రోజు ప్లానింగ్, అమినిటీస్ కార్యదర్శులకు కౌన్సెలింగ్ చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 308 సచివాలయాలు ఉండగా, శనివారం 864 మందికి, ఆదివారం ప్లానింగ్ 155, అమినిటీస్ 170 మందికి కౌన్సిల్ పూర్తి చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు బదిలీల ప్రక్రియ చేపట్టామని, ఒకేచోట ఐదేళ్లు పూర్తి చేసుకున్న వారికి ప్రస్తుత వార్డు, సొంత వార్డు మినహా ఇతర వార్డులను ఎంపిక చేసుకునేందుకు అవకాశం కల్పించామన్నారు. అభ్యర్థనలను ప్రభుత్వానికి పంపడం జరుగుతుందని కమిషనర్ వెల్లడించారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, డిప్యూటీ కమిషనర్ సతీష్ కుమార్ రెడ్డి, గూడూరు కమిషనర్ రమేష్ బాబు, సిటి ప్లానర్ ప్రదీప్ కుమార్, ఇంచార్జీ ఎస్ఈ శేషసాయి, తదితరులు పాల్గొన్నారు.

