జీఎస్టీ సంస్కరణలతో ప్రజలకు,వ్యాపారులకు కూడా ప్రయోజనం
1 min read

ఎంపీ పుట్టా మహేష్ కుమార్
జీఎస్టీ సంస్కరణలతో తగ్గనున్న ధరలు
రైతులు,పేద,మధ్యతరగతి ప్రజలకు మేలు
వినియోగం పెరిగి వ్యాపారులకు కూడా లబ్ధి
పండుగల సమయంలో సంతోషం కలిగించే నిర్ణయం
ఏలూరుజిల్లా ప్రతినిధి న్యూస్ నేడు : ప్రధాని మోదీ,కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ కు ఎంపీ ధన్యవాదాలు తెలియజేశారు.గత 11ఏళ్లలో ఎన్నో సాహసోపేతమైన సంస్కరణలు తీసుకువచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం తాజాగా తీసుకువచ్చిన జీఎస్టీ శ్లాబుల మార్పు దేశ ఆర్ధిక రంగంలోనే కీలక సంస్కరణగా నిలుస్తుందన్నారు ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. నేటి నుంచి జీఎస్టీ సంస్కరణలు అమల్లోకి వచ్చిన సందర్భంగా మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు ఎంపీ పుట్టా మహేష్ కుమార్. గతంలో ఉన్న నాలుగు శ్లాబుల విధానాన్ని మార్చి, 28%, 12% శ్లాబ్ లను పూర్తిగా ఎత్తివేస్తూ 5%, 18% శ్లాబులు మాత్రమే ఉండేట్లు తీసుకువచ్చిన సంస్కరణలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయని ఎంపీ చెప్పారు.పాలు,పాల ఉత్పత్తులపై జీఎస్టీను పూర్తిగా తీసివేయడం,12 శాతం పన్ను పరిధిలో ఉన్న 99 శాతం వస్తువులు జీరో శాతానికి తగ్గించడం,షాంపూ, టూత్పేస్ట్,తలనూనెలు, సబ్బులు, నెయ్యి, వంటపాత్రలు వంటి అనేక నిత్యావసర వస్తువులపై పన్ను 5 శాతానికి తగ్గించడం ప్రజలకు నిజమైన పండుగేనన్నారు. ముఖ్యంగా వ్యవసాయ,ఆరోగ్య సంరక్షణ రంగాల్లో పన్నులు తగ్గడం ప్రజలకు మేలు చేసే అంశం. అలాగే కార్లు, ఏసీలు, ఫ్రిజ్ లపై జీఎస్టీ 28% నుంచి 18% కి తగ్గడంతో మధ్యతరగతి ప్రజలకు కూడా ఎంతో ఉపశమనం కలిగిస్తుందన్నారు.2 శ్లాబుల పన్ను విధానం, ఆటోమేటిక్ రిజిస్ర్టేషన్లు చిన్నవ్యాపారాలకు ఉపయోగకరంగా ఉంటాయన్నారు.ఇదే సమయంలో జీఎస్టీ సంస్కరణల వల్ల మన రాష్ట్ర ఖజానాకు దాదాపు రూ:8 వేల కోట్ల నష్టం కలిగే పరిస్థితి ఏర్పడినా.పేద ప్రజలు,చిన్న వ్యాపారుల ప్రయోజనం కోసం సంస్కరణలను స్వాగతిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఉదార మనస్తత్వాన్ని చాటుకున్నారని పుట్టా మహేష్ ప్రశంసించారు. ప్రజలంతా జీఎస్టీ సంస్కరణలను స్వాగతించి, భారీగా తగ్గిన పన్నుల వల్ల లబ్ధి పొందుతారని ఆశిస్తున్నట్లు ఎంపీ పుట్టా మహేష్ చెప్పారు.

