పిఎం సూర్య ఘర్ లక్ష్యాన్ని అధిగమించాలి
1 min read

బ్యాంకర్ల సహకారంతో లబ్ధిదారులకు ఋణాలు మంజూరు చేయించండి
జిల్లా కలెక్టర్ శ్రీమతి రాజకుమారి గణియా
నంద్యాల, న్యూస్ నేడు: ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకాన్ని సమగ్రంగా అమలు చేసి, నిర్ణీత లక్ష్యాన్ని పూర్తి చేయడమే కాకుండా దానిని అధిగమించేలా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని ఎన్ఐసి వీడియో కాన్ఫరెన్స్ హాలు నుండి మండల స్థాయి అధికారులతో జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించి ఈ పథకం అమలు ప్రగతిని సమీక్షించారు.జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్య ఘర్ పథకం ద్వారా లబ్ధిదారులకు సౌర విద్యుత్ ప్రయోజనాలు అందించేందుకు పూర్తి స్థాయి అవగాహన కల్పించి సద్వినియోగం చేసుకునేలా చూడాలని విద్యుత్ శాఖ ఏఈలను కలెక్టర్ ఆదేశించారు. గ్రామాల్లో ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి, ప్రతి అర్హుడిని పథకంలో భాగస్వామ్యం చేయాలని సూచించారు.రానున్న వారం రోజుల్లోగా 2 వేల లక్ష్యం పూర్తి చేసేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని ఆమె సూచించారు. అలాగే, గ్రామాల్లో జరిగే గ్రామ సభల సందర్భంలో స్థానిక ప్రజా ప్రతినిధులను కూడా భాగస్వామ్యం చేసి, ప్రజలకు పిఎం సూర్య ఘర్ పథకం ప్రయోజనాలను వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి ఇంటికీ సౌర విద్యుత్ చేరేలా, ఈ పథకం ద్వారా పర్యావరణ పరిరక్షణతో పాటు ఆర్థిక ఆదా సాధ్యమవుతుందని ప్రజల్లో విశ్వాసం కల్పించాలన్నారు.


