మహిళ గుండెలో ఉబ్బిపోయిన ప్రధాన రక్తనాళం
1 min read

పనిచేయకుండా పోయిన అయోర్టిక్ వాల్వ్
గుండెలోకి తిరిగి వచ్చేస్తున్న రక్తసరఫరా
దీంతో తీవ్రమైన ఒత్తిడి, గుండె గదుల వ్యాకోచం
ఆరుగంటల శస్త్రచికిత్సతో సరిచేసిన కొండాపూర్ కిమ్స్ వైద్యులు
హైదరాబాద్, న్యూస్ నేడు: శరీరం మొత్తానికి గుండె అత్యంత కీలకమైన అవయవం. కానీ 49 ఏళ్ల మహిళకు గుండెలో తీవ్రమైన సమస్య తలెత్తింది. ఆమెకు గుండె ప్రధాన రక్తనాళం తీవ్రంగా ఉబ్బిపోయింది. ఈ రక్తనాళమే గుండె నుంచి శరీరంలోని ఇతర భాగాలకు రక్తాన్ని సరఫరా చేస్తుంది. దానికితోడు అయోర్టిక్ వాల్వ్ కూడా పనిచేయట్లేదు. ఫలితంగా శరీరంలో ఇతర భాగాలకు వెళ్లాల్సిన రక్తం దానికి బదులు వెనక్కి గుండెలోకి వచ్చేస్తోంది. దీనివల్ల గుండె గదులపై తీవ్రంగా ఒత్తిడి పెరిగిపోయి, గుండె వ్యాకోచించింది. ఆ మహిళకు ఆరు గంటల పాటు సుదీర్ఘమైన, హైరిస్క్ గుండె శస్త్రచికిత్స చేసి, కిమ్స్ కొండాపూర్ వైద్యులు ఆమెను ప్రాణాపాయం నుంచి కాపాడారు. ఇందుకు సంబంధించిన వివరాలను ఆస్పత్రికి చెందిన చీఫ్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నిసర్గ తెలిపారు. ఈ సమస్యల కారణంగా ఆమెకు విపరీతమైన ఆయాసం వస్తూ, కొద్ది దూరం కూడా నడవలేకపోతున్నారు. తన రోజువారీ పనులు కూడా చేసుకోలేకపోతున్నారు. భర్త లేని ఆమెకు ఇటీవలే చదువు పూర్తయ్యి, ఇంకా ఉద్యోగం రాని కుమారుడు ఉన్నాడు. దాంతో తన నిత్యజీవిత అవసరాలకు కూడా సోదరులపై ఆధారపడాల్సి వస్తోంది. అనారోగ్యం తీవ్రంగా ఉండడంతో ఆమె సోదరులు ఎంతో నమ్మకంతో కిమ్స్ ఆస్పత్రికి తీసుకొచ్చారు. డాక్టర్ ఆలూరి రవికుమార్ నేతృత్వంలోని నిపుణులైన కార్డియాలజీ బృందం ఆమెకు శస్త్రచికిత్సకు ముందు అవసరమైన గుండెవైద్య పరీక్షలు చేశారు. ఈ కేసు సంక్లిష్టత గురించి ముందే కుటుంబసభ్యులకు కౌన్సెలింగ్ చేశారు. శస్త్రచికిత్స చేసిన బృందంలో చీఫ్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ నిసర్గ, కార్డియాక్ సర్జన్ డాక్టర్ వినీత్, కార్డియాక్ ఎనస్థీషియాలజిస్టులు డాక్టర్ దివ్య, డాక్టర్ గోరింత, డాక్టర్ భవాని, సీనియర్ సర్జికల్ అసిస్టెంట్ మనో, సీనియర్ క్లినికల్ పెర్ఫ్యూజనిస్టులు దయాకర్ స్వామి, జగన్ మోహన్, అభిషేక్ ఉన్నారు.

