రీ సర్వే ప్రక్రియను నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలి
1 min read

జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్
కర్నూలు, న్యూస్ నేడు : జిల్లాలో జరుగుతున్న రీ సర్వే ప్రక్రియను పూర్తిస్థాయిలో ఎలాంటి లోపాలు లేకుండా నిర్దేశిత గడువులోపు పూర్తి చేయాలని , అదే విధంగా భూములకు సంబంధించిన మ్యుటేషన్ దరఖాస్తులను పెండింగ్ ఉండకుండా సకాలంలో పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ నూరుల్ ఖమర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు.మంగళవారం కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి రీ సర్వే, మ్యుటేషన్ తదితర అంశాల పై జాయింట్ కలెక్టర్ ఆర్డీవోలతో, తహసిల్దార్ లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రీ సర్వే పైలట్ ప్రాజెక్ట్ మొదటి దశలో జిల్లాలో ఎంపికైన 25 గ్రామాల్లో క్లరికల్ సవరణలను ఎటువంటి పొరపాట్లకు తావులేకుండా నిర్ణీత కాలవ్యవధి లోపు పూర్తిచేయాలని జాయింట్ కలెక్టర్ సంబంధిత తహశీల్దార్లను ఆదేశించారు.రెండవ దశలో పైలట్ ప్రాజెక్ట్గా ఎంపికైన 24 గ్రామాల్లో మ్యుటేషన్ ప్రక్రియను పూర్తిచేసి, ఫైనల్ నోటిఫికేషన్ జారీ చేసే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. మ్యుటేషన్లో పెండింగ్ లేకుండా ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి తుది ఉత్తర్వులు జారీ చేయాలన్నారు.వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి సి.వెంకట నారాయణమ్మ, ఆదోని సబ్ కలెక్టర్ (ఇంచార్జి) అజయ్ కుమార్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ నాగ ప్రసన్న లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

