కర్నూలు జీజీహెచ్లో ట్యూమర్ శస్త్రచికిత్స విజయవంతం
1 min read

ఆసుపత్రి అడిషనల్ డి ఎం ఈ సూపరింటెండెంట్, డా.కె.వెంకటేశ్వర్లు, మాట్లాడుతూ:
కర్నూలు, న్యూస్ నేడు: కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలోని ఎండోక్రైనాలజీ విభాగం నందు అనంతపూర్ జిల్లా హెచ్. సిద్ధాపురం గ్రామానికి చెందిన మంగళి తులసి గత ఆరు సంవత్సరాలుగా తీవ్రమైన శరీర నొప్పులు, కండరాల బలహీనతతో బాధపడుతూ, చివరకు మంచానికే పరిమితమయ్యారు. పలు ఆసుపత్రుల్లో చికిత్స తీసుకున్నప్పటికీ ఉపశమనం లభించలేదని తెలిపారు. ఆసుపత్రిలో ఆమెకు సమగ్ర వైద్య పరీక్షల తరువాత ట్యూమర్ ఇండ్యూస్డ్ ఆస్టియోమలేసియా’ అనే అరుదైన వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయ్యింది. ఆధునిక గాలియం–68 డోటాటేట్ పీఈటీ స్కాన్ ద్వారా ప్రీసాక్రల్ ప్రాంతంలో ట్యూమర్ను గుర్తించారు.ఎండోక్రైనాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీ విభాగాల వైద్యులు సమన్వయంతో మల్టీడిసిప్లినరీ విధానంలో చికిత్స అందించి, శస్త్రచికిత్స ద్వారా ట్యూమర్ను విజయవంతంగా తొలగించారు అని అన్నారు.శస్త్రచికిత్స అనంతరం 24 గంటల్లోనే రోగి ఆరోగ్య పరిస్థితిలో గణనీయమైన మెరుగుదల కనిపించిందని రక్తంలోని కీలక విలువలు సాధారణ స్థాయికి చేరుకున్నాయని పేర్కొన్నారు.ఒక వారం వ్యవధిలో ఆమె స్వయంగా తనంతటా తానే నడవగలిగే స్థాయికి చేరుకొని, రోజువారీ పనులు స్వయంగా చేసుకునే స్థితికి చేరుకున్నారని తెలిపారు.ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా అత్యాధునిక వైద్య సదుపాయాలు, నిపుణులైన వైద్యుల సేవలతో మరియు అరుదైన వ్యాధులకు విజయవంతమైన చికిత్స అందించడం సాధ్యమవుతోందని అన్నారు. ప్రజలు ప్రభుత్వ ఆసుపత్రులపై మరింత విశ్వాసం ఉంచాలని కోరారు.ఎండోక్రైనాలజీ మరియు సర్జికల్ ఆంకాలజీ విభాగపు వైద్యులను అభినందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సి ఎస్ ఆర్ ఎం ఓ డాక్టర్ పద్మజ, డాక్టర్ వెంకటరమణ, ఎండోక్రైనాలజీ విభాగపు హెచ్ఓడి, డా.శ్రీనివాసులు, సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ చైతన్య డాక్టర్ బిసన్నతదితరులు పాల్గొన్నారు.

