రోగులకు ఆపత్కాలంలో దాతలు,స్వచ్ఛంద సంస్థల అందించే సేవలు వెలకట్టలేనివి
1 min read
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్,ఎమ్మెల్యే బడేటి చంటి
జిల్లా రెడ్ క్రాస్ భవనంపై 2వ అంతస్తు నిర్మాణానికి శిలావిష్కరణ చేసిన ఎంపి
గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా సేవల్ని అభినందించిన ఎంపీ,ఎమ్మెల్యే
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: ఆపత్కాలంలో దాతలు, స్వచ్ఛంద సంస్థలు అందించే సేవలు వెలకట్టలేనివని, ఈ విషయంలో రెడ్క్రాస్ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్ అన్నారు. టిడిపి జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ప్రత్యేకంగా అభినందించారు. పేదలకు అవసరమైన వైద్యసేవలను మరింత విస్త్రృతం చేసేందుకు రెడ్క్రాస్ సంస్థకు కూడా దాతల సహకారం అవసరమని అభిప్రాయపడిన వారు ఆ దిశగా వివిధ రూపాల్లో ఆర్ధిక చేయూతనందిస్తోన్న దాతలను ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు ప్రభుత్వాసుపత్రి ప్రాంగణంలోని జిల్లా రెడ్క్రాస్ భవనంపై 2వ అంతస్తు నిర్మాణానికి శిలాఫలకావిష్కరణా కార్యక్రమాన్ని శనివారం అట్టహాసంగా నిర్వహించారు. దీంతో పాటు అక్కడ చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలకు ఏలూరు ఎంపి పుట్టా మహేష్ కుమార్, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షులు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. తొలుత వారికి ఆత్మీయ స్వాగతం లభించింది.అలాగే సుమారు 60లక్షల రూపాయలతో రెడ్క్రాస్ భవంతి 2వ అంతస్తు నిర్మాణానికి దాతృత్వంతో సేవలందించేందుకు ముందుకొచ్చిన గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా సేవల్ని ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. అనంతరం రెడ్క్రాస్ సంస్థకు ఎంపి పుట్టా మహేష్ కుమార్ 2లక్షల రూపాయల విరాళాన్ని ప్రకటించారు. కార్యక్రమాల్లో ఆర్టీసి విజయవాడ జోన్ – 2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, ఎఎంసి చైర్మన్ మామిళ్ళపల్లి పార్ధసారధి, కో-ఆప్షన్ సభ్యులు ఎస్సెమ్మార్ పెదబాబు, ప్రముఖ వ్యాపార వేత్త గుప్తా ఫౌండేషన్ అధినేత మడుపల్లి మోహన్ గుప్తా, మోటేపల్లి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.


