డీఎస్సీ అవకతవకలపై న్యాయ విచారణ జరపాలి”
1 min read
(ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సిద్దు)
న్యూస్ నేడు, పత్తికొండ: రాష్ట్రంలో నిర్వహించిన డీఎస్సీ నియామకాలపై తీవ్ర అభ్యంతరాలు, అవకతవకల ఆరోపణలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో వాటిపై సమగ్ర న్యాయ విచారణ జరిపి వాస్తవాలను ప్రజలకు వెల్లడించాలని అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్) మండల కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం పత్తికొండ తహసీల్దార్ కి ఏఐవైఎఫ్ మండల సమితి ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అవకతవకలపై నిష్పక్షపాత న్యాయ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు.అలాగే రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న అన్ని పోస్టులను వెంటనే భర్తీ చేయాలని, ఎన్నికల సమయంలో నిరుద్యోగ యువతకు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతిని తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు.డీఎస్సీతో పాటు గ్రూప్స్, పోలీస్ శాఖ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగ నియామకాలను పారదర్శకంగా నిర్వహించాలని, గత కొన్నేళ్లుగా నియామకాలు జరగకపోవడంతో వయోపరిమితి దాటిన అభ్యర్థులకు ప్రత్యేకంగా వయోపరిమితి పెంపు కల్పించాలని వారు కోరారు.రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్ల విజయోత్సవ సభలు నిర్వహించడం కంటే నిరుద్యోగ యువత సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలని, డీఎస్సీ అవకతవకలపై న్యాయ విచారణ జరిపి నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సిద్దు డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ జిల్లా సమితి సభ్యులు పెద్దయ్య, మండల కోశాధికారి కె.రవి, కార్యకర్తలు ఎన్. రవి తదితరులు పాల్గొన్నారు.

