కర్నూల్ లో “శాశ్వత హైకోర్టు బెంచ్” ఏర్పాటు చేయాలి
1 min read
పత్తికొండలో విధులు బహిష్కరించి నిరసన తెలిపిన న్యాయవాదులు
న్యూస్ నేడు, పత్తికొండ: కర్నూల్ లో శాశ్వత హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు, సీనియర్ న్యాయవాదులు సత్యనారాయణ, కృష్ణయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని పత్తికొండ బార్ అసోసియేషన్ అధ్యక్షులు మధుబాబు ఆధ్వర్యంలో న్యాయవాదులు విధులు బహిష్కరించి జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జోష్నాదేవికి వినతి పత్రం అందించారు. అనంతరం ఆర్డిఓ కార్యాలయం ఎదుట న్యాయవాదులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… కర్నూలుకు 90 రోజుల్లో హైకోర్టు బెంచ్ తెస్తామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చెప్పారని తెలిపారు. కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సర్క్యూట్ లేదా క్యాంప్ బెంచ్ ఏర్పాటు చేస్తారని పత్రికలో రావడం ఆందోళన కలిగిస్తుందని అన్నారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఇచ్చిన మాట ప్రకారం కర్నూల్ లో హైకోర్టు బెంచ్ ఏర్పాటు చేయాలని జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు విధులు బహిష్కరించి ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. అనంతరం న్యాయవాదులు ఆర్డిఓ చిన్న ఓబులేసు కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాదులు వైస్ ప్రెసిడెంట్ రవి కుమార్, జనరల్ సెక్రెటరీ జగదీష్, న్యాయవాదులు ప్రసాద్ బాబు, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి, నెట్టేకల్లు, మునయ్య, వీరేష్, భాష, మధు నాగరాజు, సాంబ, రజాక్, నాభూషణం, శీను, వీరేష్ తదితరులు పాల్గొన్నారు.


