న్యాయస్థానాన్ని అవమానించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి
1 min read

పత్తికొండలో 27వ రోజూ కొనసాగిన న్యాయవాదుల ధర్నా…
పత్తికొండ , న్యూస్ నేడు : గత నెల 24వ తేదీన పత్తికొండ కోర్టులో ఓ కేసులో లొంగిపోవడానికి వచ్చిన ముద్దాయిని కోర్టు లోకి చొరబడి మెడపట్టి లాక్కోని వెళ్లి, కోర్టు ధిక్కరణకు పాల్పడి, న్యాయస్థానాన్ని అవమానించిన చిప్పగిరి, పత్తికొండ ఎస్ఐలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సీనియర్ న్యాయవాదులు రవి ప్రకాష్, ఐఏఎల్ జిల్లా అధ్యక్షులు కృష్ణయ్య, న్యాయవాది నరసింహయ్య ఆచారి లు డిమాండ్ చేశారు. బుధవారం పత్తికొండలో న్యాయవాదులు స్థానిక కోర్టు ప్రాంగణం నందు నిరసన ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాదులు మాట్లాడుతూ.. కోర్టు విధులకు భంగం కలిగే విధంగా న్యాయ వ్యవస్థ పై దాడిలో భాగమే లొంగి పోవడానికి వచ్చిన ముద్దాయిని దౌర్జన్యంగా, బలవంతంగా లాకెళ్లిపోవడం సమంజసం కాదన్నారు. కోర్టు ధిక్కరణకు పాల్పడిన పోలీసులపై ఎలాంటి చర్యలు లేకపోవడం సిగ్గుచేటన్నారు. ఆర్టికల్ 21ని దుర్వినియోగ పరచిన పోలీస్ అధికారులపై చర్యలకు డిమాండ్ చేశారు. కోర్టు దిక్కరణకు పాల్పడిన పోలీసులపై వెంటనే చర్యలు తీసుకోవాలని న్యాయవాదులు డిమాండ్ చేశారు. వారిపై చర్యలు తీసుకోకుంటే భవిష్యత్ కార్యాచరణలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్, జూనియర్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

