ఆలూరు ఎమ్మెల్యే అరెస్ట్ కక్షసాధింపు చర్యే – మాజీ ఎంపీ బుట్టా రేణుక
1 min read
ఆలూరు న్యూస్ నేడు: ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షి అరెస్టు పూర్తిగా రాజకీయ కక్షసాధింపులో భాగమేనని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు పార్లమెంట్ సమన్వయకర్త, మాజీ ఎంపీ బుట్టా రేణుక ఆరోపించారు. చిప్పగిరి మండలం సంగాల గ్రామంలో జరిగిన ఘటన అనంతరం ఎమ్మెల్యేను లక్ష్యంగా చేసుకుని అక్రమ కేసులు నమోదు చేసి, తెల్లవారుజామున నివాసానికి చేరుకుని అరెస్టు చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని ఆమె విమర్శించారు.సంగాల గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలపై దాడి జరుగుతోందన్న సమాచారం అందడంతో అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే బూసినే విరూపాక్షిపై కూడా దాడికి యత్నించారని, ఈ ఘటనలో ఆయన సోదరుడి చేయి విరిగినా అసలు నిందితులపై చర్యలు తీసుకోకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం పోలీసుల పక్షపాత ధోరణికి నిదర్శనమని ఆమె పేర్కొన్నారు.ఎమ్మెల్యే అరెస్టును నిరసిస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చిప్పగిరి పోలీస్ స్టేషన్కు చేరుకుని, అనంతరం అంబేద్కర్ విగ్రహం వద్ద బైఠాయించి నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బుట్టా రేణుక మాట్లాడుతూ, ఎలాంటి ఆధారాలు లేకుండానే ఎమ్మెల్యే బూసినే విరూపాక్షితో పాటు దాదాపు 20 మంది నాయకులపై కల్పిత కేసులు నమోదు చేసి అరెస్టు చేయడం ప్రజాస్వామ్య విలువలను కాలరాయడమేనని అన్నారు.రాష్ట్రంలో చట్టం తన పని తాను చేయకుండా అధికార పార్టీ ఆదేశాల మేరకే పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆమె ఆరోపించారు. ప్రజల సమస్యలపై పోరాడుతున్న ప్రతిపక్ష నాయకులను అణిచివేసేందుకు అక్రమ కేసులు, అరెస్టులను ఆయుధాలుగా ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని హెచ్చరించారు.ఆలూరు ఎమ్మెల్యే బూసినే విరూపాక్షితో పాటు అరెస్టు చేసిన వారందరినీ వెంటనే బేషరతుగా విడుదల చేయాలని, దాడికి పాల్పడిన అసలు నిందితులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బుట్టా రేణుక ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.అధికార దుర్వినియోగం, కక్షసాధింపు రాజకీయాలను ప్రభుత్వం వెంటనే విరమించుకోవాలని, అధికారాలు శాశ్వతం కావని, ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ న్యాయనిర్ణేతలని బుట్టా రేణుక స్పష్టం చేశారు.



