మద్ది ఆంజనేయ స్వామి ఆలయంలో ఉత్తర ద్వార దర్శనం
1 min read

వివిధ ప్రాంతాల నుండి, గ్రామాలనుండి పోటెత్తిన భక్తులు
ఉంగుటూరు శాసనసభ్యులు పచ్చమట్ల ధర్మరాజు స్వామి వారి దర్శనం
ఆలయ మర్యాదలతో తీర్థ ప్రసాదాలు అందజేసిన ఈవో ఆర్.వి.చందన
ఏలూరుజిల్లా ప్రతినిధి,న్యూస్ నేడు: భక్తులతో పోటెత్తిన మద్దిఈ రోజు వైకుంఠ ఏకాదశి మరియు మంగళవారం సందర్భముగా ఏలూరు జిల్లా, జంగారెడ్డిగూడెం మండలము, గురవాయిగూడెం గ్రామము నందు తెల్ల మద్ది చెట్టు క్రింద స్వయంభువులై వెలిసిన శ్రీ మద్ది ఆంజనేయస్వామి వారి దర్శనార్ధమునకు చుట్టు ప్రక్కల గ్రామముల నుండియే గాక సుదూర ప్రాంతముల నుండి అధిక సంఖ్యలో విచ్చేసి శ్రీ స్వామి వారి ఆలయము చుట్టూ 108 ప్రదక్షణలు చేసి, మొక్కుబడులు తీర్చుకుని, శ్రీ స్వామి వారికి అత్యంత ప్రీతీకరమైన తమలపాకులు (నాగవల్లీ దళములు)తో అష్టోత్తరం పూజలను, అన్నప్రాసనలు, వాహనం పూజలను ఆలయ అర్చకులచే నిర్వహించుకునినారు. శ్రీ స్వామి వారి దేవస్థానమునకు ఉపాలయం అయిన శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఈ శ్రీ స్వామి వారిని భక్తులు ఉత్తర ద్వారం ద్వారా దర్శించడం జరిగినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఉంగుటూరు శాసన సభ్యులు పచ్చమట్ల ధర్మరాజు విచ్చేసి స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించినారు. అనంతరం వీరికి ఆలయ ముఖ మండపం నందు వేద ఆశీర్వచనం గావించి, శ్రీ స్వామి వారి ప్రసాదములు అందజేసినారు. ఈ రోజు శ్రీ స్వామి వారి దర్శనార్ధం ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.03.00 వరకూ విచ్చేసిన సుమారు 4950 మంది భక్తులకు శ్రీ స్వామి వారి నిత్యాన్నదాన సత్రము నందు అన్నప్రసాద వితరణ జరుపబడినది. ఈ రోజు మద్యాహ్నం/సాయంత్రం గం.5-00 వరకూ శ్రీ స్వామి వారి దేవస్థానమునకు వివిధ సేవల రూపేణా రూ.4,45,370/-లు ఆదాయము వచ్చినది. శ్రీ స్వామి వారి దర్శనార్ధమై విచ్చేసిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములూ కలుగకుండా తగిన ఏర్పాట్లు గావించినట్లు ఆలయ సహాయ కమీషనరు మరియు కార్యనిర్వహణాధికారిణి ఆర్.వి.చందన తెల్పినారు.

